Manika Batra First Indian Female To Win Bronze At Asian Table Tennis Event. భారత స్టార్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనిక బాత్రా ఆసియా కప్ టోర్నమెంట్లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది
By Medi Samrat Published on 19 Nov 2022 3:45 PM GMT
భారత స్టార్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనిక బాత్రా ఆసియా కప్ టోర్నమెంట్లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది, ఈవెంట్లో పతకం గెలిచిన మొదటి భారతీయ మహిళా ప్యాడ్లర్గా నిలిచింది. ప్రపంచ ఆరో ర్యాంకర్, మూడుసార్లు ఆసియా ఛాంపియన్ అయిన హీనా హయాటాతో జరిగిన కాంస్య పతక మ్యాచ్లో ఆమె 4-2 తేడాతో గెలిచింది. బాత్రా తన ప్రత్యర్థిని 11-6, 6-11, 11-7, 12-10, 4-11, 11-2 తేడాతో ఓడించింది. అంతకుముందు సెమీఫైనల్ మ్యాచ్లో మిమా ఇటో చేతిలో 2-4 (8-11, 11-7, 7-11, 6-11, 11-8, 7-11) తేడాతో ఓడిపోయింది. కాంస్య పతక మ్యాచ్లో మాత్రం ఆమె సత్తా చాటింది.
థాయ్లాండ్లోని బ్యాంకాక్లో జరుగుతున్న ఆసియా కప్ 2022 టోర్నమెంట్లో మొదటి రౌండ్లో చైనాకు చెందిన ప్రపంచ నం.7 చెన్ జింగ్టాంగ్పై సంచలన విజయాన్ని నమోదు చేసింది బాత్రా. ఇక ఆ తర్వాత ఆసియా కప్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో చైనీస్ తైపీకి చెందిన చెన్ స్జు-యుపై 4-3 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్కు చేరిన తొలి భారతీయ మహిళగా నిలిచింది. ప్రపంచ 44వ ర్యాంకర్ మనిక మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ చార్ట్లో 23వ ర్యాంక్లో ఉన్న చెన్ను ఓడించింది.