బంగ్లాదేశ్ ను చిత్తు చేసిన ఇంగ్లండ్

ప్రపంచ కప్ లో సంచలనాల కోసం ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులకు మరోసారి నిరాశ ఎదురైంది.

By Medi Samrat  Published on  10 Oct 2023 3:00 PM GMT
బంగ్లాదేశ్ ను చిత్తు చేసిన ఇంగ్లండ్

ప్రపంచ కప్ లో సంచలనాల కోసం ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులకు మరోసారి నిరాశ ఎదురైంది. మెన్స్ ప్రపంచ కప్-2023 లో భాగంగా ఏడవ మ్యాచ్ లో పటిష్ట ఇంగ్లండ్ జట్టును బంగ్లాదేశ్ అడ్డుకోలేకపోయింది. 137 పరుగుల భారీ తేడాతో బంగ్లాను చిత్తు చేసింది ఇంగ్లండ్ జట్టు.

టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 364 పరుగులు చేసింది. ఓపెనర్‌ డేవిడ్ మలన్ (140) , జో రూట్ (82) , బెయిర్‌స్టో (52) పరుగులు చేయడంతో భారీ స్కోరు చేసింది ఇంగ్లండ్. ఆఖరి 10 ఓవర్లు బంగ్లాదేశ్ బౌలర్లు పటిష్టంగా బౌలింగ్ వేశారు. లేకుంటే 400 పరుగుల మార్కును ఇంగ్లండ్ ఈజీగా దాటుండేది.

ఇక లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్‌ 227 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్‌ లిటన్‌ దాస్‌ (76), ముష్ఫికర్‌ రహీమ్‌ (51) మాత్రమే పోరాడగలిగారు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో రీస్‌ టాప్లే 4 వికెట్లు పడగొట్టగా.. వోక్స్‌ 2 వికెట్లు తీశాడు. సామ్‌కరన్‌, మార్క్‌వుడ్‌, అదిల్‌ రషీద్‌, లివింగ్‌స్టోన్‌ తలో వికెట్‌ తీశారు. ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్ కు ఇది తొలి విజయం.

Next Story