కెప్టెన్ కుమార సంగక్కర సోమవారం అద్భుత సెంచరీతో రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (IML) 2025 మ్యాచ్లో శ్రీలంక మాస్టర్స్ ఇంగ్లాండ్ మాస్టర్స్పై 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో శ్రీలంక మాస్టర్స్ ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ 2025 పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
ఈ ఓటమితో పోటీలో మరో మ్యాచ్ మిగిలి ఉన్నప్పటికీ, టోర్నీలో నాకౌట్కు చేరుకోవాలనే ఇంగ్లండ్ మాస్టర్స్ ఆశలు ఆవిరయ్యాయి. సంగక్కర నాయకత్వంలో ఆడుతున్న శ్రీలంక మాస్టర్స్ జట్టు ఇప్పటికే సెమీ-ఫైనల్స్లో చోటు దక్కించుకుంది. దీంతో ఆ జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో మైదానంలోకి ప్రవేశించింది. మొదట బౌలింగ్ చేయాలనే వారి నిర్ణయం సరైనదని బౌలర్లు నిరూపించారు. శ్రీలంక బౌలర్లు ఇంగ్లండ్ మాస్టర్స్ను 20 ఓవర్లలో 146/5 స్వల్ప స్కోరుకు పరిమితం చేశారు.
అనతరం 12.5 ఓవర్లలోపు లక్ష్యాన్ని ఛేదించిన శ్రీలంక పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. సంగక్కర 47 బంతుల్లో 19 ఫోర్లు, ఒక సిక్సర్తో అజేయంగా 106 పరుగులు చేసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఓపెనింగ్ భాగస్వామి రమేష్ కలువితార్న కూడా అతడికి మద్దతుగా నిలిచాడు. వీరిద్దరూ పవర్ప్లేలో 76 పరుగులు చేశారు.
అంతకుముందు ఓపెనర్ ముస్టాడ్(50)తో పాటు బౌలర్లు టిమ్ బ్రెస్నన్ (18 నాటౌట్), క్రిస్ ట్రెమ్లెట్ (14 నాటౌట్) చివరి క్షణాల్లో కీలకమైన 30 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో 146 లక్ష్యాన్ని నమోదు చేయగలిగింది. అయితే ఆ లక్ష్యాన్ని శ్రీలంక సులువుగా చేధించింది.