కృనాల్ పాండ్యాలో మార్పుకు రాహుల్ ద్రావిడ్ కారణమా..!
Krunal Pandya Hugging Asalanka in 1st ODI Triggers Meme. రాహుల్ ద్రావిడ్.. ఎంత కూల్ గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
By Medi Samrat Published on 19 July 2021 4:22 PM GMT
రాహుల్ ద్రావిడ్.. ఎంత కూల్ గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాహుల్ ద్రావిడ్ లో కోపం 'క్రెడ్' యాప్ యాడ్ లో మాత్రమే చూడగలిగాం..! ప్రస్తుతం శ్రీలంకలో సిరీస్ ఆడుతున్న జట్టుకు రాహుల్ ద్రావిడ్ కోచ్ గా ఉన్నాడు. యంగ్ టీమ్ మొదటి వన్డేలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఇక ఆటగాళ్ల ప్రవర్తనలో కూడా మార్పు వచ్చింది. దీనికి ద్రావిడ్ కారణమంటూ పెద్ద ఎత్తున ప్రశంసలు లభిస్తూ ఉన్నాయి.
మొదటి వన్డేలో శ్రీలంక క్రికెటర్ చరిత్ అసలంకను భారత ఆల్రౌండర్ కృనాల్ పాండ్య హగ్ చేసుకోవడం పై ప్రశంసలు లభిస్తూ ఉన్నాయి. కృనాల్ పాండ్య బౌలింగ్ చేస్తున్న 22వ ఓవర్ మూడో బంతికి ఈ సంఘటన జరిగింది. ధనంజయ డిసిల్వా, అసలంకా క్రీజులో ఉన్నారు. స్ట్రైక్లో ఉన్న డిసిల్వా బంతిని బలంగా బాదడంతో స్టెయిట్గా వచ్చిన బంతిని కృనాల్ పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఈ సందర్భంలో పక్కన ఉన్న నాన్ స్ట్రైకర్ అసలంకా వైపు దూసుకెళ్లాడు. అప్రమత్తమైన కృనాల్ లేచి అసలంకాను హగ్ చేసుకున్నాడు. క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించిన కృనాల్ పాండ్యను ట్విట్టర్ వేదికగా పలువురు క్రికెటర్లు అభినందిస్తున్నారు.
ఇది 'రాహుల్ ద్రవిడ్ ఎఫెక్ట్' అని కూడా అంటున్నారు. ప్రస్తుతం టిమిండియా కోచ్గా రాహుల్ ద్రావిడ్ వ్యవహరిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. గతంలో కృనాల్ పాండ్యా కోపం చూసిన అభిమానులు.. ఇప్పుడు అతడిలో వచ్చిన మార్పును చూసి రాహుల్ ద్రావిడ్ వల్లే ఇదంతా అంటూ చెబుతున్నారు. తొలి వన్డేలో తొమ్మిది వికెట్ల నష్టానికి శ్రీలంక 262 పరుగులు చేసింది. మూడు వికెట్ల నష్టానికి భారత్ 36.4 ఓవర్లలో ఈ లక్ష్యాన్ని సాధించింది. భారత్ తరఫున కెప్టెన్ శిఖర్ ధావన్ అజేయంగా 86 పరుగులు చేయగా, ఇషాన్ కిషన్ 59 పరుగులు చేశాడు.