కపిల్ దేవ్ వార్నింగ్.. అలా అయితేనే ఆట‌గాళ్ల‌ను ప్రపంచకప్‌కు ఎంపిక చేయాలి

ఆసియా కప్ ఆగస్టు 30న ప్రారంభం కానుంది. భారత జట్టు సెప్టెంబర్ 2న పాకిస్థాన్‌తో తలపడనుంది.

By Medi Samrat  Published on  26 Aug 2023 3:13 PM GMT
కపిల్ దేవ్ వార్నింగ్.. అలా అయితేనే ఆట‌గాళ్ల‌ను ప్రపంచకప్‌కు ఎంపిక చేయాలి

ఆసియా కప్ ఆగస్టు 30న ప్రారంభం కానుంది. భారత జట్టు సెప్టెంబర్ 2న పాకిస్థాన్‌తో తలపడనుంది. గాయం నుంచి కోలుకుంటున్న శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ లకు టీమ్ ఇండియా చోటు కల్పించింది. చాలా కాలం తర్వాత ఇద్దరు ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడనున్నారు. అయితే రాహుల్ ఇప్పటికీ స్నాయువు గాయంతో బాధపడుతున్నాడు. ఆసియా క‌ప్‌ ప్రారంభ మ్యాచ్‌లకు రాహుల్ దూరంగా ఉంటాడని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే.. అయ్యర్, రాహుల్ పునరాగమనంపై భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సంతోషం వ్యక్తం చేశాడు. దీంతో పాటు టీమిండియాకు వార్నింగ్ కూడా ఇచ్చాడు.

ప్రపంచకప్‌కు ముందు ఆటగాళ్లందరినీ మైదానంలో పరీక్షించాలని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు. ఏ ఆటగాడైనా తన ఫిట్‌నెస్‌ను పరీక్షించుకోవడానికి ఆసియా కప్ అత్యుత్తమ టోర్నమెంట్ అని అన్నాడు. ప్రపంచకప్‌ చాలా దగ్గర్లో ఉందని.. అలాంటి పరిస్థితుల్లో ఆటగాళ్లందరికీ ఫిట్‌నెస్‌ టెస్ట్‌ నిర్వహించాలని కపిల్‌దేవ్‌ అన్నాడు.

గాయం నుంచి తిరిగి వచ్చిన క్రికెటర్ల గురించి కపిల్ దేవ్ మాట్లాడుతూ “గాయ‌ప‌డిన వారికి ఇంకా అవకాశం రాలేదు. వారు నేరుగా ప్రపంచకప్‌లో ఆడి మళ్లీ గాయపడితే ఏమి జరుగుతుందో మీరు ఊహించగలరా? దీని కోసం మొత్తం టీమ్ మూల్యం చెల్లిస్తుందన్నాడు.

ఆటగాళ్లకు ఆసియా కప్‌లో బ్యాటింగ్, బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వాల‌ని కపిల్‌దేవ్‌ చెప్పాడు. దీనివ‌ల్ల వారు లయను తిరిగి పొందడానికి, వారి విశ్వాసాన్ని పెంచుకోవ‌డానికి అవ‌కాశం ఉంటుంద‌న్నాడు. ప్రపంచకప్‌లో ఎవరైనా ఆటగాడు గాయపడితే.. అది చాలా దారుణం. గాయం నుంచి తిరిగి వచ్చిన ఆటగాళ్లకు ఆడే అవకాశం రావాలి.. ఫిట్‌గా ఉంటేనే ప్రపంచకప్‌కు ఎంపిక చేయాలన్నాడు.

ఆసియా కప్ ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది. పాకిస్థాన్‌లో నాలుగు, శ్రీలంకలో తొమ్మిది మ్యాచ్‌లు జరగనున్నాయి. సెప్టెంబర్ 2న పాకిస్థాన్‌తో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. భారత్‌ గ్రూప్‌-ఎలో ఉంది. పాకిస్థాన్, నేపాల్ కూడా ఆ గ్రూప్‌లోనే ఉన్నాయి. గ్రూప్-బిలో బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ ఉన్నాయి. రెండు గ్రూపుల నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్-4 రౌండ్‌కు చేరుకుంటాయి. అక్కడి నుంచి రెండు జట్లు నేరుగా ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి.

Next Story