భారత క్రికెట్ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, ఇంగ్లాండ్తో జరగబోయే టెస్ట్ సిరీస్కు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశం వచ్చినా తిరస్కరించినట్లు తెలిపాడు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ తనను కెప్టెన్సీ కోసం సంప్రదించిందని, అయితే తాను అందుకు సున్నితంగా నిరాకరించినట్లు తాజాగా బయటపెట్టాడు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఐపీఎల్ సమయంలో రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత, తన భవిష్యత్తు పనిభారం గురించి బీసీసీఐతో చర్చించినట్లు బుమ్రా వెల్లడించాడు. ఐదు టెస్టుల సిరీస్లో నా పనిభారం ఎలా ఉండాలనే దానిపై నేను బీసీసీఐతో మాట్లాడాను. నా వెన్ను సమస్యను పర్యవేక్షిస్తున్న వారితో, నాకు శస్త్రచికిత్స చేసిన సర్జన్తో కూడా చర్చించానన్నారు. ఆ తర్వాత బీసీసీఐకి ఫోన్ చేసి, నాయకత్వ బాధ్యతల కోసం తనను పరిగణించవద్దని కోరినట్లు బుమ్రా తెలిపాడు. ఐదు టెస్టుల సిరీస్లో అన్ని మ్యాచ్లు ఆడలేనప్పుడు నాయకత్వ పాత్రలో ఉండటం సరికాదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు బుమ్రా.