భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) IPL 2025 సీజన్ మిగిలిన మ్యాచ్ లకు ఆటగాళ్ల భర్తీకి సంబంధించిన రూల్స్ ను మార్చినట్లు సమాచారం. ఫ్రాంచైజీలు మిగిలిన టోర్నమెంట్ కోసం తాత్కాలిక ప్రత్యామ్నాయాలపై సంతకం చేయడానికి అనుమతించింది బీసీసీఐ. గతంలో, IPL 2025 కోసం భర్తీ చేసే ఆటగాడి విషయంలో మ్యాచ్కు ముందు గాయం లేదా అనారోగ్యం సందర్భాలలో మాత్రమే మార్పులను అనుమతించాయి. కానీ ఇప్పుడు అందుకు సంబంధించి కీలకమైన మార్పులను చేసింది బీసీసీఐ.
భారతదేశం, పాకిస్తాన్ మధ్య సైనిక ఉద్రిక్తతల కారణంగా వారం రోజుల పాటు సస్పెన్షన్ తర్వాత IPL 2025 మే 17న తిరిగి ప్రారంభం కానుంది. ముఖ్యంగా దేశానికి సంబంధించిన విధులు, వ్యక్తిగత కారణాలు లేదా గాయాల కారణంగా తిరిగి రాలేని విదేశీ క్రికెటర్లకు సంబంధించి BCCI ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కొత్త నియమం ప్రకారం తాత్కాలిక ప్రత్యామ్నాయంగా సంతకం చేసిన ఆటగాళ్లు IPL 2026 వేలానికి ముందు నిలుపుదలకు మాత్రం అర్హులు కారు. ఈ ఆటగాళ్ళు లీగ్లోకి తిరిగి రావాలంటే తదుపరి వేలం ద్వారా తిరిగి పూల్లోకి ప్రవేశించాలి.