IPL-2024: చెపాక్‌లో ఫ్యాన్స్‌ను ఆట పట్టించిన జడేజా.. వైరల్ వీడియో

జడేజా అభిమానులను ఆటపట్టించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By Srikanth Gundamalla  Published on  9 April 2024 6:19 AM GMT
ipl-2024, cricket, ravindra jadeja, prank,  chepauk stadium,

IPL-2024: చెపాక్‌లో ఫ్యాన్స్‌ను ఆట పట్టించిన జడేజా.. వైరల్ వీడియో 

ఐపీఎల్‌ మ్యాచ్‌లు సందడిగా కొనసాగుతున్నాయి. 2024 సీజన్‌ మొత్తం ఇండియాలోనే జరుగుతుండటంతో క్రికెట్‌ స్టేడియాల్లో అభిమానులు కిక్కిరిసిపోతున్నారు. తమ ఇష్టమైన టీమ్‌లను ఉత్సాహపరిచి.. ప్రోత్సహించేందుకు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఇక ఏప్రిల్ 8వ తేదీన చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో చెన్నై సూపర్‌ కింగ్స్ మ్యాచ్‌ జరిగింది. కేకేఆర్‌తో ఈ మ్యాచ్‌ జరగ్గా.. చెన్నై సూపర్‌ కింగ్సే విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో చెన్నై విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌ సందర్భంగా జడేజా అభిమానులను ఆటపట్టించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మొదట కేకేఆర్‌ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌ దిగింది సీఎస్కే. రుతురాజ్‌ గైక్వాడ్‌ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 67 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రచిన్ రవీంద్ర 15, మిచెల్ 25 పరుగులు చేశారు. ఇక ఆ తర్వాత వచ్చిన శివమ్‌ దూబే 18 బంతుల్లో 28 పరుగులు చేసి ఔట్‌ అయ్యాడు. అతడు ఔట్‌ అయ్యాక ధోనీ బ్యాటింగ్ చేయాల్సి ఉంది. కానీ.. జడేజా తానే బ్యాటింగ్‌కు వస్తున్నట్లుగా ప్రాంక్ చేశాడు. అభిమానులను కొంత టీజ్‌ చేశాడు. ప్యాడ్స్‌.. బ్యాట్‌ పట్టుకుని కొంత దూరం నడిచాడు. దాంతో.. అభిమానులు పెద్ద ఎత్తున కేకలు పెట్టారు. అంతే జడ్డూ కూడా వెంటనే తిరిగి వెనక్కి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జడ్డూ చేసిన ప్రాంక్‌పై పలువురు నవ్వుతోన్న ఏమోజీలను పెడుతున్నారు.

ఇక ధోనీ ఎంట్రీతో చెపాక్ స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది. ధోనీ బ్యాటింగ్ కోసం ఎదురు చూస్తున్న అభిమానుల్లో ఒక్క సారిగా ఉత్సాహం రెట్టింపు అయ్యింది. కేకలు పెడుతూ.. తెగ అల్లరి చేశారు. దాంతో.. స్టేడియం మొత్తం అభిమానుల అరుపులతో మార్మోగిపోయింది. వారి అరుపులతో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కీలక ప్లేయర్‌ రస్సేల్‌ చెవులు మూసుకున్నాడు. ఇక రసేల్‌ చెవులు మూసుకుంటున్న వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. ధోనీ ఫ్యాన్సా మజాకా అంటు పలువురు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ధోనీతో ఇలానే ఉంటుందని అంటున్నారు. కాగా.. ఎంఎస్‌ ధోనీ 3 బంతులను మాత్రమే ఎదుర్కొని ఒక పరుగు చేశాడు.

Next Story