పంజాబ్కు చెందిన 39 ఏళ్ల వీల్చైర్ క్రికెటర్ విక్రమ్ సింగ్, జూన్ 5న ప్రారంభం కానున్న శ్రీమంత్ మాధవరావు సింధియా మెమోరియల్ T-10 ఛాంపియన్షిప్ ఏడవ ఎడిషన్లో పాల్గొనడానికి లూథియానా నుండి గ్వాలియర్కు రైలులో ప్రయాణిస్తున్నప్పుడు గుండెపోటుతో మరణించాడు. రైలు ఢిల్లీ మీదుగా వెళుతుండగా విక్రమ్ అనారోగ్యానికి గురయ్యాడు. రైలు మధుర జంక్షన్ చేరుకున్నప్పుడు అతని పరిస్థితి క్షీణించింది. అతను స్పందించలేదు.
అతని సహచరుడు సోమ్జీత్ సింగ్ గౌర్, రైల్వే GRP (ప్రభుత్వ రైల్వే పోలీస్) సిబ్బందికి సమాచారం ఇచ్చినప్పటికీ, సహాయం సకాలంలో రాలేదని తెలిపారు. విక్రమ్ 8-9 సంవత్సరాల క్రితం లూధియానాలో వీల్చైర్ క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. స్వయంగా ప్రాక్టీస్ చేసేవాడు. తనకు లభించే మార్గాల ద్వారా అన్ని ఖర్చులను భరించేవాడు. గత సంవత్సరం, శ్రీమంత్ మాధవరావు సింధియా మెమోరియల్ T-10 ఛాంపియన్షిప్లో పంజాబ్ జట్టు టైటిల్ గెలుచుకోవడంలో అతను ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఈ ఎడిషన్లో కూడా ఆడటానికి వెళ్ళాడు.
రైలు ఢిల్లీ దాటుతున్నప్పుడు, అతను తీవ్రమైన తలనొప్పి ఉందని, విపరీతంగా చెమటలు పడుతున్నాయని ఫిర్యాదు చేశాడు. మేము రైలులో ఉన్న రైల్వే GRP సిబ్బందికి సమాచారం ఇచ్చాము. మధుర స్టేషన్లో వైద్యులు అందుబాటులో ఉంటారని మాకు చెప్పారు. ఆ తర్వాత విక్రమ్ నిద్రపోయాడు. అనుకున్న సమయానికి రైలు మధుర స్టేషన్ కు చేరుకోలేదు. అయితే అప్పటికే విక్రమ్ చనిపోయారని సన్నిహితులు తెలిపారు.
పంజాబ్లోని మాలెర్కోట్ల జిల్లాలోని అహ్మద్గఢ్ సమీపంలోని పోహిర్ గ్రామానికి చెందిన విక్రమ్ స్వయంకృషితో ఎదిగిన క్రీడాకారుడు. శారీరక సవాళ్లు ఉన్నప్పటికీ, వీల్చైర్ క్రికెట్ రంగంలో తనకంటూ ఒక పేరును సంపాదించుకున్నాడు. 2020లో, బంగ్లాదేశ్తో జరిగే ద్వైపాక్షిక సిరీస్ కోసం భారత వీల్చైర్ క్రికెట్ జట్టుకు పిలుపు అందింది. దురదృష్టవశాత్తు కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఆ సిరీస్ జరగలేదు.