ప్రపంచకప్ నెగ్గిన‌ భారత మహిళల కబడ్డీ జ‌ట్టు

రెండవ మహిళల కబడ్డీ ప్రపంచ కప్ 2025లో భారత మహిళల కబడ్డీ జట్టు తన అద్భుతమైన ప్రదర్శనను కొనసాగించింది.

By -  Medi Samrat
Published on : 24 Nov 2025 9:22 PM IST

ప్రపంచకప్ నెగ్గిన‌ భారత మహిళల కబడ్డీ జ‌ట్టు

రెండవ మహిళల కబడ్డీ ప్రపంచ కప్ 2025లో భారత మహిళల కబడ్డీ జట్టు తన అద్భుతమైన ప్రదర్శనను కొనసాగించింది. సోమవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో చైనీస్ తైపీని ఓడించి చరిత్ర సృష్టించింది. త‌ద్వారా భారత మహిళల కబడ్డీ జట్టు 2వ మహిళల కబడ్డీ ప్రపంచకప్ 2025 టైటిల్‌ను గెలుచుకుంది. సోమవారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 35–28తో చైనీస్ తైపీని ఓడించి వరుసగా రెండో ప్రపంచకప్ విజేతగా నిలిచిన ఘనత సాధించింది.

మ్యాచ్ ప్రారంభం నుంచి ఆధిపత్యం చెలాయించిన భారత జట్టు రైడింగ్, డిఫెన్స్ రెండింటిలోనూ అద్భుతమైన సమన్వయాన్ని ప్రదర్శించింది. తొలి అర్ధభాగంలో స్వల్ప ఆధిక్యం సాధించిన జట్టు.. రెండో అర్ధభాగంలో దూకుడుగా ఆడటంతో చైనీస్ తైపీకి పునరాగమనం చేసే అవకాశం ఇవ్వలేదు. టోర్నీ ఆద్యంతం క్రమశిక్షణ, దూకుడు, సమతూకంతో కూడిన ఆటను ప్రదర్శించిన భారత జట్టు టైటిల్ మ్యాచ్‌లో చైనీస్ తైపీతో తలపడి గెలిచింది.

జట్టుకు ప్రధాన కోచ్ తేజస్వి, అసిస్టెంట్ కోచ్ ప్రియాంక మార్గనిర్దేశం చేశారు. ఈ చారిత్రాత్మక విజయంలో హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఐదుగురు ఆటగాళ్ల సహకారం చాలా ముఖ్యమైనది. భారత జట్టు కెప్టెన్ రీతూ నేగి, వైస్ కెప్టెన్ పుష్ప రాణా హిమాచల్‌కు చెందినవారు. వీరితో పాటు చంపా ఠాకూర్, భావనా ​​ఠాకూర్, సాక్షి శర్మ కూడా టోర్నీ ఆద్యంతం పటిష్ట ప్రదర్శన చేస్తూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. వైస్-కెప్టెన్ పుష్పా రాణా తన డాషింగ్ రైడింగ్, అద్భుతమైన డిఫెన్స్‌తో ప్రత్యర్థి జట్లను ఇబ్బంది పెట్టింది. హిమాచల్‌కు చెందిన ఈ ఐదుగురు ఆటగాళ్ల ప్రదర్శన జట్టు బలాన్ని పెంచింది. టోర్నమెంట్‌లోని ప్రతి మ్యాచ్‌లోనూ భారత జట్టు అద్భుతమైన క్రమశిక్షణ, దూకుడుని ప్రదర్శించింది.

ఆదివారం ఇరాన్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో తొలి నిమిషాల నుంచి భారత ఆటగాళ్లు ఆధిపత్యం ప్రదర్శించారు. రైడింగ్, డిఫెన్స్, ఆలౌట్ అనే వ్యూహాలు ప్రత్యర్థి జట్టుకు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. భారత జట్టు సాధించిన ఈ అద్భుతమైన విజయంపై హిమాచల్ ప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కుల్దీప్ రాణా జట్టును, రాష్ట్ర ఆటగాళ్లను హృదయపూర్వకంగా అభినందించారు. హిమాచల్‌ కుమార్తెలు అంతర్జాతీయ వేదికలపై అద్భుతమైన ప్ర‌ద‌ర్శ‌న‌తో రాష్ట్రానికి కీర్తిప్రతిష్టలు తీసుకొచ్చారన్నారు. కెప్టెన్ రీతూ నేగి, వైస్ కెప్టెన్ పుష్పా రాణా నాయకత్వంలో భారత జట్టు క్రమశిక్షణ, దూకుడు, సమతుల్య ఆటను ప్రదర్శించిందని అన్నారు.

ఇక చైనీస్ తైపీతో జరిగిన ఫైనల్ మ్యాచ్ చాలా ఉత్కంఠగా సాగింది. జట్టు ఆటతీరు, నాయకత్వ తీరు చూసి ప్రపంచకప్‌ గెలుస్తామన్న ఉత్కంఠ దేశవ్యాప్తంగా క్రీడా ప్రేమికుల్లో తారాస్థాయికి చేరుకుంది.

Next Story