శ్రీలంకపై భారత్ భారీ విజయం.. ఏకంగా 317 పరుగుల తేడాతో..
India won by 317 runs Against Srilanka. శ్రీలంకపై భారత్ భారీ విజయాన్ని అందుకుంది. వన్డే చరిత్రలో అత్యధిక పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.
By Medi Samrat Published on 15 Jan 2023 3:30 PM GMT
శ్రీలంకపై భారత్ భారీ విజయాన్ని అందుకుంది. వన్డే చరిత్రలో అత్యధిక పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. భారత్ ఏకంగా 317 పరుగుల తేడాతో విజయం అందుకుంది. 391 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 22 ఓవర్లలో 73 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో మూడు వన్డేల సిరీస్ ను భారత్ 3-0 తో క్లీన్ స్వీప్ చేసింది. మూడో వన్డేలో భారత్ భారీ స్కోరు చేసింది. విరాట్ కోహ్లీ భారీ సెంచరీ, ఓపెనర్ శుభ్ మాన్ గిల్ సెంచరీ సాయంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 390 పరుగులు చేసింది. కోహ్లీ 110 బంతుల్లో 166 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కోహ్లీ ఇన్నింగ్స్ లో 13 ఫోర్లు, 8 భారీ సిక్సులు ఉన్నాయి. తొలుత శుభ్ మాన్ గిల్ (116) సెంచరీ కొట్టగా, ఆ తర్వాత కోహ్లీ దంచేశాడు. కోహ్లీకిది వన్డేల్లో 46వ సెంచరీ. ఈ మూడు వన్డేల సిరీస్ లో కోహ్లీ 2 సెంచరీలు చేశాడు. శ్రేయాస్ అయ్యర్ 38 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ 7, సూర్యకుమార్ యాదవ్ 4 పరుగులకే అవుటయ్యారు. కెప్టెన్ రోహిత్ శర్మ 42 పరుగులు చేశాడు. లంక బౌలర్లలో కసున్ రజిత 2, లహిరు కుమార 2, చామిక కరుణరత్నే 1 వికెట్ తీశారు.