దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత్ విజయాన్ని సాధించింది. 113 పరుగులతో భారత్ విజయాన్ని అందుకుంది. మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 327 పరుగులు చేయగా.. దక్షిణాఫ్రికా 197 పరుగులు చేసింది. ఇక భారత్ రెండో ఇన్నింగ్స్ లో 174 పరుగులకే ఆలౌట్ అవ్వగా.. దక్షిణాఫ్రికా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే దక్షిణాఫ్రికా 191 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ 113 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో రెండో రోజు వర్షం కారణంగా తుడిచిపెట్టుకు పోయిన సంగతి తెలిసిందే..!
దక్షిణాఫ్రికా సెకండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ డీన్ ఎల్గార్ 77 పరుగులతో రాణించాడు. అతడు మినహా మిగిలిన ఆటగాళ్లు ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. బవుమా 35 పరుగులతో నాటౌట్ గా నిలిచినప్పటికీ.. ఇతర బ్యాట్స్మెన్ ను భారత బౌలర్లు పెవిలియన్ కు పంపించారు. బుమ్రా 3 వికెట్లు తీయగా, షమీ మూడు కీలక వికెట్లను తీశాడు. హైదరాబాదీ సిరాజ్ రెండు వికెట్లను, అశ్విన్ ఆఖరి రెండు వికెట్లను తీయడంతో భారత్ విజయం లాంఛనమైంది. ఆఖర్లో రబడా, ఎంగిడీల వికెట్లను అశ్విన్ వరుస బంతుల్లో తీయడం విశేషం. 68 ఓవర్ల పాటూ బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు 191 పరుగుల వద్ద సెకండ్ ఇన్నింగ్స్ ను ముగించింది. రెండో టెస్ట్ మ్యాచ్ జొహాన్నెస్ బర్గ్ వేదికగా జనవరి 3 నుండి జరగనుంది.