వన్డేల్లో విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టు ఆ తర్వాతి సిరీస్లోనే ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. మూడు మ్యాచ్ల సిరీస్ను ఆసీస్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. హోబర్ట్ వేదికగా సాగిన మూడో వన్డేలో 185 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. అంతకుముందు రెండు వన్డేలను కూడా ఆస్ట్రేలియానే గెలిచింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 409 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెరీర్లో చివరి మ్యాచ్ ఆడుతున్న కెప్టెన్ అలైస్సా హీలీ (98 బంతుల్లో 158; 27 ఫోర్లు, 2 సిక్సర్లు) భారత బౌలర్లపై విరుచుకుపడింది. వికెట్ కీపర్ బ్యాటర్ బెత్ మూనీ (84 బంతుల్లో 106 నాటౌట్; 10 ఫోర్లు, సిక్స్) సెంచరీ బాదింది. లక్ష్య ఛేదనలో భారత్ 45.1 ఓవర్లలో 224 పరుగులకు ఆలౌటైంది. భారత ప్లేయర్లలో స్మృతి మంధన, కశ్వీ గౌతమ్ డకౌట్ అయ్యారు. ప్రతీకా రావల్ 27, జెమీమా 42, కెప్టెన్ హర్మన్ 25, దీప్తి శర్మ 29, స్నేహ్ రాణా 44 పరుగులు చేశారు. అంతకుముందు మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను మాత్రం భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇరు జట్ల మధ్య మార్చి 6 నుంచి ఏకైక టెస్ట్ ప్రారంభం కానుంది. పెర్త్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది.