ఐసీసీ వ‌న్డే ర్యాంకింగ్స్‌.. మూడో స్థానానికి భార‌త్

India Surpass Pakistan In ODI Rankings After Thumping Win Over England.ఇంగ్లాండ్‌తో జ‌రిగిన తొలి వ‌న్డేలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 July 2022 9:25 AM GMT
ఐసీసీ వ‌న్డే ర్యాంకింగ్స్‌.. మూడో స్థానానికి భార‌త్

ఇంగ్లాండ్‌తో జ‌రిగిన తొలి వ‌న్డేలో టీమ్ఇండియా ఘ‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ విజ‌యంతో ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌) విడుద‌ల చేసిన వ‌న్డే ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా త‌న స్థానాన్ని మెరుగుప‌ర‌చుకుంది. చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్థాన్ ను వెన‌క్కు నెట్టి మూడో స్థానానికి చేరుకుంది. ఇంగ్లాండ్‌తో వ‌న్డే సిరీస్ ప్రారంభానికి ముందు 105 పాయింట్ల‌తో భార‌త్ నాలుగో స్థానంలో ఉండ‌గా.. తొలి మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో విజ‌యం సాధించ‌డంతో మూడు పాయింట్లు భార‌త్ ఖాతాలో చేరాయి. ప్ర‌స్తుతం 108 రేటింగ్ పాయింట్ల‌తో భార‌త్ మూడో స్థానంలో కొన‌సాగుతోంది.

వ‌న్డే ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ (127) అగ్ర‌స్థానంలో కొన‌సాగుతుండ‌గా, ఇంగ్లాండ్ (122) రెండో స్థానంలో ఉంది. భార‌త్ 108 పాయింట్లతో మూడో స్థానానికి చేర‌గా.. 106 పాయింట్లు ఉన్న పాకిస్థాన్ నాలుగో స్థానానికి ప‌డిపోయింది. ఆస్ట్రేలియా(101), సౌతాఫ్రికా (99) ఐదు, ఆరు స్థానాల్లో నిలిచాయి. ఆ త‌రువాత‌ బంగ్లాదేశ్‌ (96), శ్రీలంక (92), వెస్టిండీస్‌ (71), ఆఫ్ఘనిస్తాన్‌ (69), ఐర్లాండ్‌ (54) జ‌ట్లు ఉన్నాయి.

మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన బట్లర్‌ సేనకు బుమ్రా (6/19), మహ్మద్‌ షమీ (3/31) చుక్క‌లు చూపించారు. దీంతో 25.2 ఓవర్లలో 110 పరుగులకే ఇంగ్లాండ్ కుప్ప‌కూలింది. జోస్‌ బట్లర్‌ (32 బంతుల్లో 30; 6 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలవగా నలుగురు బ్యాటర్లు 'డకౌట్‌' అయ్యారు. అనంతరం రోహిత్‌ శర్మ (58 బంతుల్లో 76 నాటౌట్‌; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు), శిఖర్‌ ధవన్‌ (54 బంతుల్లో 31 నాటౌట్‌; 4 ఫోర్లు) చెలరేగి ఆడటంతో భారత్‌ 18.4 ఓవర్లలోనే వికెట్‌ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది.

Next Story