సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్ఇండియా ఓటములతోనే మొదలుపెట్టింది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియాకు సిరీస్ చేజార్చుకుంది. తొలి రెండు వన్డేల్లో భారత జట్టు ఘోరంగా విఫలమైంది. దీంతో ఇంటా, బయట విమర్శలు మొదలయ్యాయి. ఇదే అదునుగా టీమ్ ఇండియాను మానసికంగా మరింత దెబ్బ తీసేందుకు ఆసీస్ మాజీలు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా.. ఆసీస్ మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ లేకుండా టీమ్ఇండియా టెస్టు సిరీస్ గెలిస్తే ఏడాది పాటు సంబరాలు చేసుకోవచ్చునని అన్నాడు.
విరాట్ కోహ్లీ లేకుండా టీమ్ఇండియా ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్ గెలవడం దాదాపు అసాధ్యమన్నారు. ఒకవేళ గెలిస్తే.. ఏడాది పాటు సంబరాలు చేసుకోవచ్చునని తెలిపాడు. విరాట్ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని.. కానీ ఆ స్థానంలో కేఎల్ రాహుల్ బాగా రాణిస్తాడని అన్నారు. గతంలో ఆస్ట్రేలియాలో ఆడిన అనుభవం అతడికి ఎంతో ఉపయోగపడనుందని తెలిపాడు.
ఇక టెస్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానే అంటే ఎంతో ఇష్టమని.. అతడు కెప్టెన్సీ సైతం బాగా చేస్తాడని కితాబిచ్చాడు. "కోహ్లీ ఆడలేకపోవడాన్ని అవకాశంగా పరిగణించాలి. అక్కడ బాగా రాణించడానికి ప్రయత్నించి చరిత్ర సృష్టించాలి. ఒకవేళ కోహ్లీ లేకుండానే టీమ్ఇండియా ఆస్ట్రేలియాను దాని సొంతగడ్డపై మీద ఓడిస్తే.. ఏడాది పాటు సంబరాలు చేసుకోవచ్చు. అది నమ్మశక్యం కాని విజయంగా మారుతుందని "కార్ల్క్ తెలిపాడు.