మూడోసారి పాక్ జట్టుతో భారత్ తలపడాలంటే..?
ఆసియా కప్ లో భాగంగా భారత జట్టు పాకిస్థాన్ ను రెండు మ్యాచ్ లలోనూ చిత్తు చిత్తు చేసింది.
By - Medi Samrat |
ఆసియా కప్ లో భాగంగా భారత జట్టు పాకిస్థాన్ ను రెండు మ్యాచ్ లలోనూ చిత్తు చిత్తు చేసింది. సూపర్-4 లో పాకిస్థాన్ భారత జట్టు చేతిలో ఓడిపోవడంతో ఇక మూడోసారి ఫైనల్ లో భారత్ తో తలపడడానికి మార్గాలు దాదాపుగా మూసుకుపోయాయి. సూపర్ 4 దశలో భాగంగా జరిగిన ఈ మ్యాచ్లో పాకిస్థాన్ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. అయితే ఇది నాకౌట్ మ్యాచ్ కాకపోవడంతో సల్మాన్ ఆఘా సేనకు అవకాశాలు ఇంకా పూర్తిగా మూసుకుపోలేదు. కానీ, ఫైనల్ చేరాలంటే మాత్రం ఇకపై ప్రతీ మ్యాచ్ చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సూపర్ 4 రౌండ్ రాబిన్ ఫార్మాట్లో జరగనుండటంతో పాకిస్థాన్కు ఇంకా రెండు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఫైనల్ రేసులో నిలవాలంటే ఆ జట్టు రేపు శ్రీలంకతో, గురువారం బంగ్లాదేశ్తో జరగనున్న మ్యాచ్లలో తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. మిగిలిన రెండు మ్యాచ్ లలో ఏ ఒక్క మ్యాచ్ ఓడిపోయినా పాకిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమించగలదు. ఒకవేళ రెండింటిలోనూ గెలిస్తే, ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా ఫైనల్కు చేరే అవకాశాలు ఉన్నాయి.
ప్రస్తుత పాయింట్ల పట్టికను పరిశీలిస్తే భారత్, బంగ్లాదేశ్ చెరో విజయంతో రెండేసి పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాయి. నెట్ రన్రేట్ (+0.689) విషయంలో భారత్ మెరుగ్గా ఉంది. పాకిస్థాన్, శ్రీలంక ఆడిన తొలి మ్యాచ్లలో ఓడి సున్నా పాయింట్లతో ఉన్నాయి. బంగ్లాదేశ్, శ్రీలంక జట్లకు కూడా ఇంకా ఫైనల్ చేరే అవకాశాలు సజీవంగానే ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు తమ తదుపరి మ్యాచ్లలో బంగ్లాదేశ్, శ్రీలంకలతో తలపడనుంది. ఈ రెండింటిలో ఒక్క మ్యాచ్ గెలిచినా భారత్ సునాయాసంగా ఫైనల్కు అర్హత సాధిస్తుంది.