ఓటమి.. తప్పు ఎక్కడ జరిగిందో చెప్పిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా

ఐపీఎల్ 2025 క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్‌తో తలపడింది.

By Medi Samrat
Published on : 2 Jun 2025 9:58 AM IST

ఓటమి.. తప్పు ఎక్కడ జరిగిందో చెప్పిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా

ఐపీఎల్ 2025 క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ 87 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆధారంగా పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో ముంబైని ఓడించింది. ఈ మ్యాచ్‌లో విజయంతో పంజాబ్ జట్టు 11 ఏళ్ల తర్వాత ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకుంది.

కాగా.. జూన్ 3న జరిగే ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పంజాబ్ తలపడనుంది. అదే సమయంలో ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ ఆరోసారి టైటిల్ గెలవాలన్న కల చెదిరిపోయింది. పంజాబ్ చేతిలో ఓటమి తర్వాత ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా తీవ్ర నిరాశకు గురయ్యాడు. మ్యాచ్ అనంతరం ముంబై ఓటమికి బాధ్యత వహించాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు పంజాబ్ కింగ్స్‌కు 204 పరుగుల లక్ష్యాన్ని అందించింది. ఈ షాకింగ్ ఓట‌మితో ముంబై జట్టు ఐపీఎల్ 2025 ప్రయాణం కూడా ముగిసింది. పంజాబ్‌తో మ్యాచ్‌లో ఓటమి తర్వాత హార్దిక్ పాండ్యా ముంబై ఓటమికి తానే కారణమన్నాడు. జట్టు ఎక్కడ తప్పు చేసిందో చెప్పాడు.

మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ గురించి మాట్లాడుతూ హార్దిక్ .. 'శ్రేయాస్ బ్యాటింగ్ చేసిన విధానం, రిస్క్‌లు తీసుకుని షాట్లు ఆడే విధానం నిజంగా అద్భుతం. అతను బాగా బ్యాటింగ్ చేశాడని నా అభిప్రాయం. మేము సమానంగా స్కోర్ చేసాము, కానీ బౌలింగ్ యూనిట్‌గా మేము మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. పెద్ద మ్యాచ్‌లలో ఇదే ముఖ్యమని నేను భావిస్తున్నాను. పంజాబ్ బ్యాట్స్‌మెన్ మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టడంతో మేం అనుకున్న రీతిలో రాణించలేకపోయాం. నేను వికెట్‌ను నిందించను. బహుశా మనం సరైన లెంగ్త్ బౌలింగ్ చేసి ఉంటే లేదా సరైన సమయంలో సరైన బౌలర్‌ని ఉపయోగించినట్లయితే ఫలితం కొద్దిగా భిన్నంగా ఉండేది.

ముఖ్యమైన మ్యాచ్‌లో పవర్‌ఫుల్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. నాలుగు ఓవర్ల స్పెల్‌లో 40 పరుగులిచ్చి వికెట్‌ పడలేదు. బుమ్రా 18వ ఓవర్‌లో 8 పరుగులు ఇచ్చాడు, అది అతని స్పెల్‌లోని చివరి ఓవర్. చివరి నాలుగు ఓవర్లలో పంజాబ్‌కు 41 పరుగులు అవసరం అయితే హార్దిక్ 17వ ఓవర్‌లో ట్రెంట్ బౌల్ట్‌ను బౌలింగ్ చేయమని పిలిచాడు.. అతను 10 పరుగులు ఇచ్చాడు.

17వ ఓవర్ బుమ్రా వేయాలా అని హార్దిక్‌ను అడిగినప్పుడు.. కెప్టెన్ "వెనుక తిరిగి చూసుకుంటే రిజ‌ల్ట్‌ భిన్నంగా ఉండేది.. బుమ్రా పరిస్థితి తెలుసుకున్నాడు. 18 బంతులు ఉన్నాయి.. జస్సీ ప్రత్యేకంగా చేయగలడు. అయితే క్వాలిఫయర్-2లో అలా జరగలేదని కార‌ణాలు వెల్ల‌డించాడు.

ఇక మ్యాచ్ విన్న‌ర్ అయ్యర్ తన ఇన్నింగ్స్‌లో 8 సిక్సర్లు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో అయ్యర్ 41 బంతులు ఎదుర్కొని 87 పరుగులతో అజేయంగా నిలిచాడు. 5 ఫోర్లు కూడా బాదాడు. అతని స్ట్రైక్ రేట్ 212.

Next Story