Bengaluru: చిన్నస్వామి స్టేడియంలో RCB మ్యాచ్‌లకు కర్ణాటక గ్రీన్ సిగ్నల్

కర్ణాటక ప్రభుత్వం ఎం. చిన్నస్వామి స్టేడియంలో 2026 ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

By -  Knakam Karthik
Published on : 16 March 2026 4:00 PM IST

Sports News, Cricket News, IPL2026, RCB, ChinnaswamyStadium, Bengaluru, KarnatakaGovernment, SRHvsRCB

Bengaluru: చిన్నస్వామి స్టేడియంలో RCB మ్యాచ్‌లకు కర్ణాటక గ్రీన్ సిగ్నల్

కర్ణాటక ప్రభుత్వం ఎం. చిన్నస్వామి స్టేడియంలో 2026 ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత ఏడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలిసారి టైటిల్ గెలిచిన సందర్భంలో జరిగిన తొక్కిసలాట కారణంగా స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణపై నెలకొన్న సందిగ్ధతకు ఈ నిర్ణయంతో తెరపడింది.

కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (KSCA), ఆర్‌సీబీ ప్రతినిధులతో చర్చించిన అనంతరం భద్రతా ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ అనుమతి మంజూరు చేసింది. బెంగళూరు పోలీస్ కమిషనర్ శ్రీమంత్ కుమార్ సింగ్ నేతృత్వంలోని కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఐపీఎల్ 19వ ఎడిషన్ మార్చి 28న ప్రారంభం కానుండగా, డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఈ ప్రారంభ మ్యాచ్‌తో పాటు, టోర్నమెంట్ ప్రారంభ వేడుకలు మరియు ఆర్‌సీబీ అన్‌బాక్సింగ్ ఈవెంట్‌ కూడా ఎం. చిన్నస్వామి స్టేడియంలోనే జరగనున్నాయి.

ఈ సీజన్‌లో ఆర్‌సీబీ తన ఏడు హోమ్ మ్యాచ్‌లలో ఐదింటిని బెంగళూరులో ఆడనుండగా, మిగిలిన రెండింటిని రాయ్‌పూర్‌లో నిర్వహించనుంది. ప్రభుత్వం అందించిన ఈ సహకారానికి మరియు మార్గదర్శకత్వానికి కేఎస్‌సీఏ ప్రతినిధి వినయ్ మృత్యుంజయ హోంమంత్రికి మరియు నిపుణుల కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. భద్రత మరియు కార్యాచరణ అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఈ ఆమోదం లభించిందని కేఎస్‌సీఏ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

Next Story