మోర్కెల్‌ను బౌలింగ్ కోచ్‌గా పరిగణించాలని బీసీసీఐని కోరిన గంభీర్

భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ నియమితులయ్యాడు

By Medi Samrat  Published on  12 July 2024 4:14 PM GMT
మోర్కెల్‌ను బౌలింగ్ కోచ్‌గా పరిగణించాలని బీసీసీఐని కోరిన గంభీర్

భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ నియమితులయ్యాడు. శ్రీలంక పర్యటన నుంచి కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా జూలై 09న సోషల్ మీడియాలో గంభీర్‌ను ప్రధాన కోచ్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు సహాయక సిబ్బందిని ప్రకటించాల్సి ఉంది. గంభీర్ కోచింగ్ స్టాఫ్‌లో బ్యాటింగ్ కోచ్, బౌలింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్ ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. ఇదిలా ఉంటే.. పాకిస్థాన్ జట్టుతో కూడా పనిచేసిన టీమిండియా బౌలింగ్ కోచ్ రేసులో ఓ విదేశీ వెటరన్ పేరు కూడా చేరింది.

టీమిండియా కొత్త బౌలింగ్ కోచ్ రేసులో దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ మోర్నీ మోర్కెల్ చేరాడు. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. బౌలింగ్ కోచ్ పదవికి మోర్కెల్‌ను పరిగణించాలని గంభీర్ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డును కోరాడు. మోర్నే మోర్కెల్ ఇప్పుడు ఆస్ట్రేలియాలో నివసిస్తున్నాడు. కోచ్‌గా అనేక జట్లతో పనిచేశాడు. గంభీర్, మోర్కెల్ కూడా ఐపీఎల్‌లో కలిసి పనిచేశారు. ఈ ఇద్దరు దిగ్గజాలు ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్‌కు పనిచేశారు. గంభీర్ గత సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌లో చేరిన తర్వాత మోర్కెల్ అదే జట్టులో భాగమయ్యాడు.

గత ఏడాది భారత్‌లో జరిగిన వన్డే కప్‌లో పాక్ జట్టు కోచ్‌గా మోర్నీ మోర్కెల్ ఉన్నాడు. అయితే జట్టు పేలవమైన ప్రదర్శన కారణంగా అతను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి)తో తన ఒప్పందం ముగియడానికి కొన్ని నెలల ముందు తన పదవిని విడిచిపెట్టాడు. టీమ్ ఇండియా కొత్త బౌలింగ్ కోచ్ రేసులో ఇప్పటివరకు చాలా మంది పేర్లు వ‌చ్చాయి. లక్ష్మీపతి బాలాజీ, వినయ్ కుమార్ పేర్లు కూడా వినిపించాయి. అయితే.. భారత మాజీ బౌలర్ జహీర్ ఖాన్‌ను బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు ఒక నివేదిక కూడా పేర్కొంది.

39 ఏళ్ల మోర్నీ మోర్కెల్ 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైరయ్యాడు. అతడు తన కెరీర్‌లో దక్షిణాఫ్రికా తరపున 86 టెస్ట్ మ్యాచ్‌లు, 117 ODIలు, 44 T20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో మోర్నీ మోర్కెల్ టెస్టులో 309, వన్డేల్లో 188, టీ20లో 47 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో ఆటగాడిగా కూడా పాల్గొన్నాడు.

Next Story