టీమిండియా మాజీ పాస్ట్ బౌలర్ ఆర్పీ సింగ్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆర్పీ సింగ్ తండ్రి శివప్రసాద్ సింగ్ కరోనాతో పోరాడుతూ బుధవారం కన్నుమూశారు. ఆర్పీ సింగ్ ఈ ఐపీఎల్ సీజన్లో కామెంటేటర్గా వ్యవహరిస్తున్న సమయంలోనే అతని తండ్రి కరోనా బారిన పడ్డారు. ఈ క్రమంలోనే ఆర్పీ సింగ్ బయోబబుల్ను వదిలి బయటికి వచ్చి తండ్రిని చూసుకుంటున్నాడు. అయినా ఆర్పీ తండ్రి కోలుకోకపోగా.. బుధవారం మృత్యువాత పడ్డారు.
తండ్రి మరణవార్తను ఆర్పీ సింగ్.. తన ట్విటర్ ద్వారా పంచుకున్నాడు.' నా తండ్రి శివప్రసాద్ సింగ్ ఇక లేరన్న వార్త జీర్ణించుకోలేకపోతున్నా. 15 రోజులు కరోనాతో పోరాడిన ఆయన ఇవాళ మృత్యువాత పడ్డారు. నా తండ్రి లేరనే వార్త నన్ను కుంగదీసినా మీకు చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. మా నాన్న ఆత్మకు శాంతి చేకూరాలంటూ మీరంతా ఆ దేవుడిని ప్రార్థించాలని కోరుతున్నా. మిస్ యూ నాన్న అంటూ ట్వీట్ చేశాడు. ఇదిలావుంటే.. మరో క్రికెటర్ పియూష్ చావ్లా తండ్రి కూడా ఇటీవల కరోనాతో మృత్యువాత పడ్డారు.