స్టార్ ఇండియా జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ ను అంతర్జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ITA) శుక్రవారం సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ 21 నెలల పాటు కొనసాగుతుందని.. ఈ సస్పెన్షన్ ఇప్పటికే 2021 నుండి అమలులో ఉందని తెలుస్తోంది. సస్పెన్షన్ జూలై 2023 వరకు ఉంటుంది. ఈ సమయంలో ఆమె భారతదేశం కోసం ప్రపంచ వేదికపై జిమ్నాస్టిక్-సంబంధిత కార్యకలాపాలలో పోటీ పడలేదు. నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు పరీక్షల్లో తేలడంతో ఆమెపై అంతర్జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఐటీఏ) 21 నెలల నిషేధం విధించింది. 2016లో ‘రియో’ విశ్వవేదికపై ప్రమాదకరమైన ‘ప్రొడునొవా’ విన్యాసంతో దీప ఆకట్టుకుంది. ప్రదర్శన ముగిసి ల్యాండింగ్ సమస్యతో త్రుటిలో ఆమె కాంస్య పతకాన్ని కోల్పోయి చివరకు నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. గాయాల బెడదతో మరే మెగా ఈవెంట్లోనూ ఆమె పాల్గొనలేకపోయింది. 2021 అక్టోబర్లోనే ఆమె డోపింగ్లో పట్టుబడింది. కానీ ఈ విషయాన్ని ఇప్పుడు బహిర్గతం చేశారు. అప్పటి నుంచి శిక్షాకాలం అమలు కావడంతో ఈ ఏడాది జూలై 10వ తేదీతోనే నిషేధం ముగుస్తుంది.
నిషేధిత ఉత్ప్రేరకం హిగనమైన్ పరీక్షలో ఆమె పాజిటివ్గా తేలినట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో ఆమె డోపింగ్కు పాల్పడినట్లు రుజువైంది. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ప్రకారం హిగనమైన్ నిషేధిత లిస్టులో ఉంది. 2021 అక్టోబర్ 11వ తేదీన ఆమె వద్ద శ్యాంపిల్ సేకరించారు. అప్పటి నుంచి ఆమె పాల్గొన్న అన్ని టోర్నీల్లోని ఫలితాలను డిస్క్వాలిఫై చేశారు. హిగనమైన్ ఉత్ప్రేరకాన్ని 2017లో వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ నిషేధిత జాబితాలో చేర్చింది.