వికెట్ తీయగానే ఓవరాక్షన్.. సీరియస్ యాక్షన్ తీసుకున్న బీసీసీఐ..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జి) వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) మధ్య ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది.
By Medi Samrat
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జి) వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) మధ్య ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. ఇందులో హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్లో లక్నో బౌలర్ దిగ్వేష్ రాఠీ, సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ మధ్య మైదానంలో తీవ్ర వాగ్వాదం జరిగింది.
దిగ్వేష్ రాఠీ.. అభిషేక్ వికెట్ను తీశాక ఈ సంఘటన జరిగింది. వికెట్ తీయగానే తన నోట్బుక్ వేడుకతో అభిషేక్కి కోపం తెప్పించాడు. ఈ సమయంలో ఇరువురి మధ్య అంపైర్లు జోక్యం చేసుకొని వారిని వారించారు. ఇప్పుడు అభిషేక్, దిగ్వేష్ ఇద్దరికీ బీసీసీఐ భారీ శిక్ష విధించింది. ఈ సీజన్లో 5 డీమెరిట్ పాయింట్లను తన ఖాతాలో వేసుకున్న దిగ్వేష్ రాఠీ.. తదుపరి మ్యాచ్ ఆడకుండా సస్పెండ్ అయ్యాడు.
లక్నో విధించిన 206 పరుగులను ఛేదించే సమయంలో సన్రైజర్స్ హైదరాబాద్ యువ బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ తన దూకుడు బ్యాటింగ్తో జట్టును పటిష్ట స్థితిలో ఉంచాడు. అతని తుఫాను ఇన్నింగ్స్ను కీలక సమయంలో దిగ్వేష్ రాఠీ ముగించాడు. వికెట్ తీసిన తర్వాత రాఠీ తన ట్రేడ్మార్క్ 'నోట్బుక్' వేడుకను చేసాడు. ఇది అభిషేక్కి కోపం తెప్పించింది. అభిషేక్.. దిగ్వేష్ రాఠీ వేడుకను చూసిన తర్వాత నిగ్రహాన్ని కోల్పోయాడు. దీంతో ఇద్దరు ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.. అభిషేక్ నోటికి పని చెప్పాడు.
చిత్రాలు, వీడియోలలో అభిషేక్ కోపంగా దిగ్వేష్ రాఠీ వైపు చూపిస్తూ, "నేను నీ జుట్టు పట్టుకుని చంపేస్తాను" అని చెప్పడం కనిపించింది. దీంతో పరిస్థితి తీవ్రస్థాయికి చేరడంతో మైదానంలో ఉన్న అంపైర్లు వచ్చి శాంతింపచేయాల్సి వచ్చింది.
మ్యాచ్ ముగిసిన తర్వాత బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ఇద్దరు ఆటగాళ్లను కలుసుకుని విషయాన్ని శాంతింపజేశాడు. శుక్లా ఇద్దరు ఆటగాళ్లకు ఆట యొక్క స్ఫూర్తిని కొనసాగించాలని.. మైదానంలో ఈ ప్రవర్తనకు దూరంగా ఉండాలని సూచించారు.. అయితే BCCI IPL నిబంధనలను ఉల్లంఘించినందుకు ఇద్దరు ఆటగాళ్లకు జరిమానా విధించింది.
Abhishek Sharma enjoying with Digvesh Rathi and others post match 😂 #IPL #IPL2025 #LSGvSRH #SRHvLSG #SRHvsLSG #LSGvSRH #PatCummins #Pant #SanjivGoenka pic.twitter.com/qWIGczENY5
— Sofia (@Sofia_realm) May 19, 2025
దిగ్వేష్ రాఠీ వేడుకలు జరుపుకునే విధానంపై ప్రశ్నలు తలెత్తడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి దూకుడు వేడుకల వల్ల మందలింపులు, జరిమానాలు ఎదుర్కొన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు బీసీసీఐ ఈసారి మరింత కఠిన చర్యలు తీసుకుంది.
Abhishek Sharma and Digvesh Rathi after the match.
— Viratology (@Nafees_Crick) May 19, 2025
Shukla ji is omnipresent pic.twitter.com/oqNaDEzdy9
లక్నో vs సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్లో నిబంధనలను ఉల్లంఘించినందుకు దిగ్వేష్, అభిషేక్లకు జరిమానా విధించినట్లు బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. దిగ్వేష్ రాఠీ మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించారు. ఐపీఎల్ నిబంధనలను ఉల్లంఘించినందుకు అతడికి ఈ జరిమానా విధించారు. దిగ్వేష్ రాఠీ ఈ సీజన్లో మూడోసారి ఐపీఎల్ నిబంధనలను ఉల్లంఘించాడు. నిబంధనలను ఉల్లంఘించినందుకు ఇది లెవల్ 1 నేరం, దీనికి అతను 2 డీమెరిట్ పాయింట్లను పొందాడు. దీనికి ముందు కూడా మూడు డీమెరిట్ పాయింట్లు (ఏప్రిల్ 1న పంజాబ్ కింగ్స్పై ఒక డీమెరిట్, ఏప్రిల్ 4న ముంబై ఇండియన్స్పై రెండు డీమెరిట్లు) అందుకున్నాడు. ఇప్పుడు అతని మొత్తం డీమెరిట్ పాయింట్ల సంఖ్య ఐదు.
ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. ఐదు డీమెరిట్ పాయింట్లు అంటే ఒక మ్యాచ్ నిషేధం (సస్పెన్షన్). అందువల్ల, దిగ్వేష్ రాఠీ ఇప్పుడు LSG (లక్నో సూపర్ జెయింట్స్) తదుపరి మ్యాచ్లో ఆడలేడు. ఈ మ్యాచ్ 2025 మే 22న అహ్మదాబాద్లో గుజరాత్ టైటాన్స్తో జరగాల్సి ఉంది. లెవల్ 1 నేరాలకు మ్యాచ్ రిఫరీ నిర్ణయమే అంతిమంగా పరిగణించబడుతుంది. తప్పనిసరిగా అనుసరించాలి.
ఐపీఎల్ నిబంధనలను ఉల్లంఘించినందుకు సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) స్టార్ ఆటగాడు అభిషేక్ శర్మకు తన మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించారు. సోమవారం లక్నోలో లక్నో సూపర్ జెయింట్ (ఎల్ఎస్జి)తో జరిగిన మ్యాచ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సీజన్లో అభిషేక్ నియమాలను ఉల్లంఘించడం ఇదే మొదటిసారి. ఇది లెవల్ 1 దుష్ప్రవర్తన. దీంతో అతనికి ఒక డీమెరిట్ పాయింట్ వచ్చింది.