ధోనీని వేలానికి విడిచిపెడితేనే చెన్నైకి బెట‌ర్‌

CSK should not retain Dhoni in mega auction. యూఏఈ వేదిక‌గా నిర్వ‌హించిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) విజ‌య‌వంతమైంది

By Medi Samrat  Published on  17 Nov 2020 2:33 PM GMT
ధోనీని వేలానికి విడిచిపెడితేనే చెన్నైకి బెట‌ర్‌

యూఏఈ వేదిక‌గా నిర్వ‌హించిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) విజ‌య‌వంతమైంది. రోహిత్ సార‌థ్యంలోని ముంబై ఇండియ‌న్స్ ఐదో సారి టైటిల్‌ను సొంతం చేసుకోగా.. తొలిసారి చెన్నై సూప‌ర్‌కింగ్స్ ప్లే ఆఫ్స్ చేర‌కుండానే నిష్ర్క‌మించింది. ఈ సీజ‌న్ ప్రారంభం ముందు నుంచే చెన్నైని క‌ష్టాలు వెంటాడాయి. వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో ఆ జ‌ట్టు స్టార్ ప్లేయ‌ర్లు సురేశ్ రైనా, హ‌ర్భ‌జ‌న్ సింగ్ లీగ్‌కు దూరం అయ్యారు. ప‌లువురు ఆట‌గాళ్లు క‌రోనా బారీన ప‌డ‌డం.. ధోనీ కూడా ఫామ్‌లో లేకుండా పోవ‌డంతో చెన్నై 7వ స్థానంతో టోర్నీని ముగించింది.

చెన్నైపై ముఖ్యంగా ధోనీ పై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చిన‌ప్ప‌టికి త‌మ జ‌ట్టు కెప్టెన్ చెన్నై యాజ‌మాన్యం వెన‌కేసుకొచ్చింది. అంతేకాదు భార‌త్‌లో 2021 సీజ‌న్‌లో కూడా త‌మ జ‌ట్టుకు ధోనినే నాయ‌క‌త్వం వ‌హిస్తాడ‌ని చెప్పింది. ఇదిలా ఉంటే.. 2021 సీజ‌న్ లో కొత్త‌గా మ‌రో ఫ్రాంచైజీ రాబోతుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. 9వ జ‌ట్టు రావాలంటే.. అంద‌రు ఆట‌గాళ్లు వేలంలో ఉండాల్సిందే. ఇందుకోసం బీసీసీఐ భారీ వేలం నిర్వ‌హించ‌నున్నంద‌ని తెలుస్తోంది. ఒక‌వేళ వేలం నిర్వ‌హిస్తే చెన్నై జ‌ట్టు ధోనిని వ‌దులుకోవ‌డ‌మే బెట‌ర్ అని అంటున్నాడు కామెంటేట‌ర్‌, భార‌త జ‌ట్టు మాజీ ఆట‌గాడు ఆకాశ్ చోప్రా.

మెగా ఆక్షన్ ఉంటే.. ధోనీనీ సీఎస్‌కే రిలీజ్ చేయాలి. మెగా వేలంలో తీసుకున్న ఆటగాడు మూడేళ్ల పాటు జట్టుతోనే ఉంటాడు. మ‌రీ ధోని మూడేళ్ల పాటు ఆడ‌తాడా..? ధోని తీసుకోవ‌ద్ద‌నేది త‌న ఉద్దేశ్యం కాద‌ని.. అత‌డు త‌రువాతి సీజ‌న్ ఆడ‌తాడ‌ని.. ఐతే 2022, 2023 సీజ‌న్ల‌లో ప‌రిస్థితి ఏంటో ఆలోచించుకోవాలి. అంటిపెట్టుకుంటే రూ.15 కోట్లు చెల్లించాల్సి వస్తుందంటున్నా.. ఒక వేళ ధోనీ వచ్చే సీజన్ ఆడి తదుపరి సీజన్లు ఆడకుంటే మీకు రూ.15 కోట్ల డబ్బు తిరిగి వస్తుంది. కానీ అంతటి విలువ చేసే ఆటగాడు అందుబాటులో ఉండడు కదా? అదే ధోనీని వేలంలోకి పంపించి రైట్ టు మ్యాచ్ కార్డ్ కింద తీసుకుంటే డబ్బుకు తగ్గ ఆటగాళ్లను తీసుకోవచ్చు. అప్పుడు డ‌బ్బులు క‌లిసి వ‌స్తాయి. అయితే మెగా వేలం చెన్నైకి అవ‌స‌రం. ఎందుకంటే.. ఆ జ‌ట్టులో రిటైన్ చేసుకునే స్థాయిలో ఆట‌గాళ్లు లేర‌ని అని చోప్రా తెలిపాడు.

మరోవైపు ఈ మెగా వేలంపై ఫ్రాంచైజీలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, రాజస్థాన్‌ జట్లు పూర్తిస్థాయి వేలాన్ని ఆహ్వానిస్తుండగా.. ముంబై, ఢిల్లీ యాజమాన్యాలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి. మ‌రీ 2021 సీజ‌న్‌లో కొత్త జ‌ట్టు రానుందో మ‌రికొద్ది రోజులు ఆగితే తేలిపోతుంది.


Next Story