మొతేరా పిచ్ పై ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తొలి టీ20లో వికెట్ ఇలా లేదని వాపోయాడు. స్లో వికెట్ పై తమ ఆటగాళ్లు సరిగా ఆడలేకపోయారని తెలిపాడు. పిచ్ కారణంగా తాము ఆటలో వెనుకబడ్డామని పేర్కొన్నాడు.
లైన్ కు కట్టుబడి తమ ఆటగాళ్లు బౌలింగ్ చేశారని మోర్గాన్ తెలిపాడు. కానీ, భారత్ మాకంటే గొప్పగా బౌలింగ్ చేసిందని పేర్కొన్నాడు. గాయంతో రెండో టీ20కి దూరమైన బౌలర్ మార్క్ వుడ్ తదుపరి మ్యాచ్ కు అందుబాటులో ఉంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు మోర్గాన్. తదుపరి మ్యాచ్ లో స్పిన్ పిచ్ అందుబాటులో ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. ఈ సవాళ్లన్నిటికీ మేము సిద్ధమేనని వెల్లడించాడు.
మొదటి 11 ఓవర్లలో 91/2తో మంచి స్థితిలో ఉన్నాం. కానీ, ఆ తర్వాత భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. తొలి మ్యాచ్ తో పోలిస్తే ఇది భిన్నమైన పిచ్. దీంతో మేము ఈ గేమ్లో వెనుకబడ్డాం. ఇది కొంత నిరాశ కలిగించింది. స్లో వికెట్ కారణంగా మేము పోరాడలేకపోయాం. పేస్ తక్కువ ఉంది. పేస్ అనేది బ్యాట్స్మెన్ లకు ఎల్లప్పుడూ సవాలే. ఈ వికెట్పై మా ఆటగాళ్ల ప్రదర్శన పట్ల అసంతృప్తిగా ఉన్నా అని ఇంగ్లాండ్ కెప్టెన్ అన్నాడు.