సిరీస్ కోల్పోయిన భారత్
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలోనూ భారత్ ఓటమి పాలైంది.
By - Medi Samrat |
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలోనూ భారత్ ఓటమి పాలైంది. అడిలైడ్ లో జరిగిన వన్డే మ్యాచ్ లో ఆసీస్ భారత్ పై రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్ నిర్ణిత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది. అనంతరం 265 టార్గెట్ తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా రెండు వికెట్ల తేడాతో లక్ష్యాన్ని సాధించింది. ఈ గెలుపుతో 3 మ్యాచుల సిరీస్ లో ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా సిరీస్ సొంతం చేసుకుంది. పెర్త్ లో జరిగిన మొదటి వన్డేలో కూడా భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. మూడో వన్డే ఈనెల 29న సిడ్నీలో జరగనుంది.
భారతజట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 264 పరుగులు మాత్రమే చేయగలిగింది. రోహిత్ శర్మ (73), శ్రేయస్ అయ్యర్ (61) అర్ధ శతకాలతో రాణించారు. అక్షర్ పటేల్ (44), హర్షిత్ రాణా (24) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. కెప్టెన్ శుభ్మన్ గిల్ (9) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరగా..విరాట్ కోహ్లీ (0) ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. దీంతో భారత్ 17 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రోహిత్ శర్మ జట్టును ఆదుకున్నాడు. అయ్యర్తో కలిసి కీలకమైన 118 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. చివర్లో హర్షిత్ రాణా మెరుపులతో జట్టు స్కోరును 250 పరుగులు దాటించారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా 4 కీలక వికెట్లు తీశాడు.