Coach Soumyadeep asked me to fix a match: Manika Batra. టోక్యో 2020 ఒలింపిక్స్ లో మనికా బత్రా మూడో రౌండ్ లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే..!
By Medi Samrat Published on 4 Sep 2021 11:52 AM GMT
టోక్యో 2020 ఒలింపిక్స్ లో మనికా బత్రా మూడో రౌండ్ లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే..! మౌనిక బాత్రా మ్యాచ్ లు ఆడుతున్న సమయంలో ఆమె దగ్గర కోచ్ లు కనిపించకపోవడంపై తీవ్ర చర్చ జరిగింది. తాజాగా ఆమె సంచలన ఆరోపణలు చేసింది. భారత టేబుల్ టెన్నిస్ నేషనల్ కోచ్ సౌమ్యదీప్ రాయ్పై స్టార్ ప్లేయర్ మనికా బత్రా సంచలన ఆరోపణలు చేసింది. దోహా వేదికగా ఈ ఏడాది మార్చిలో జరిగిన ఒలింపిక్స్ క్వాలిఫయర్స్లో జాతీయ కోచ్ తనను మ్యాచ్ ఫిక్సింగ్ చేయమన్నారని ఆమె ఆరోపించింది. అందుకు తాను అంగీకరించలేదని.. టోక్యో ఒలింపిక్స్లో అందుకే సౌమ్యదీప్ రాయ్ సహాయం తీసుకోలేదని టీటీ సమాఖ్యకు నివేదించింది.
ఫిక్సింగ్ ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, ఇందుకు కావాల్సిన సాక్షాధారాలు తన దగ్గరున్నాయని, సరైన సమయంలో వాటిని అధికారుల ముందుంచుతానని తెలిపింది. మ్యాచ్ ఫిక్సింగ్ అంశంపై మాట్లాడేందుకు కోచ్ నా వ్యక్తిగత హోటల్ గదికి వచ్చాడని, తాను మాట వినకపోవడంతో బెదిరింపులకు దిగాడని ఆమె తెలిపింది. ఓ శిష్యురాలు కోసమే కోచ్ అలా వ్యవహరించారని వివరించింది మనికా బత్రా. జాతీయ కోచ్పై మనికా బత్రా చేసిన ఆరోపణలపై టీటీఎఫ్ఐ విచారణ చేపట్టలేదు. ఒలింపిక్స్ సందర్భంగా నేషనల్ కోచ్ సేవలను తిరస్కరించడంపై అప్పట్లో టేబుల్ టెన్నిస్ సమాఖ్య మనికాపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా.. వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు మనికా బత్రా సంచలన ఆరోపణలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.