శ్రీలంక‌ భారీ విజయం.. అదే టేబుల్ టాప్‌..!

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌ 16వ మ్యాచ్‌లో శ్రీలంక 105 పరుగుల తేడాతో ఒమన్‌ను ఓడించింది.

By -  Medi Samrat
Published on : 12 Feb 2026 4:20 PM IST

శ్రీలంక‌ భారీ విజయం.. అదే టేబుల్ టాప్‌..!

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌ 16వ మ్యాచ్‌లో శ్రీలంక 105 పరుగుల తేడాతో ఒమన్‌ను ఓడించింది. ఈ టోర్నీలో శ్రీలంక జట్టుకు ఇది వరుసగా రెండో విజయం. ఒమన్ కెప్టెన్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 5 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. అనంత‌రం ఒమన్ జట్టు 120 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో శ్రీలంక 105 పరుగుల తేడాతో మ్యాచ్‌ను గెలుచుకుంది. ఒమన్ జట్టులో ముహమ్మద్ నదీమ్ 53 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అయితే అతని ఇన్నింగ్స్ జట్టు విజయానికి సరిపోలేదు.

నిజానికి మొదట బ్యాటింగ్ చేసిన‌ శ్రీలంకకు శుభారంభం లభించలేదు. కేవలం 15 పరుగుల స్కోరు వద్ద ఆ జట్టుకు తొలి ఎదురుదెబ్బ తగిలింది. మ్యాచ్‌లో ఓపెనర్లు ఇద్దరూ ఒమన్ బౌలర్ల ధాటికి క్రీజులో నిల‌వ‌లేక‌పోయారు. కాక‌పోతే ఒమన్ జట్టు బౌలర్లపై శ్రీలంక మిడిలార్డర్ అద్భుతంగా ఎదురుదాడికి దిగింది. కుశాల్ మెండిస్ (61), పవన్ రత్నాయకే (60) అద్భుతంగా బ్యాటింగ్ చేసి మూడో వికెట్‌కు 94 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి స్కోరును వేగంగా పెంచారు. ఆ త‌ర్వాత లోయర్ ఆర్డర్‌లో దసున్ షనక కేవలం 20 బంతుల్లో 50 పరుగులు చేశాడు. దీని కారణంగా ఈ మ్యాచ్‌లో జట్టు భారీ స్కోరును చేరుకోగలిగింది.

226 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఒమన్ జట్టుకు శుభారంభం లభించలేదు. జట్టు కేవలం 36 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అక్కడ నుండి మహ్మద్ నదీమ్, వసీం అలీ నాలుగో వికెట్‌గా ఇన్నింగ్స్‌ను చ‌క్కిదిద్ద‌డానికి ప్ర‌య‌త్నించారు. వీరిద్దరూ మినహా ఏ బ్యాట్స్‌మెన్ కూడా 10 పరుగుల మార్కును కూడా దాటలేకపోయారు. దీని కారణంగా శ్రీలంక జట్టు 105 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది.

Next Story