IPL ఫైనల్కు ముందు విరాట్ కోహ్లీకి ఇబ్బందులు.. ఎఫ్ఐఆర్ దాఖలు
ఆర్సీబీ ఐపీఎల్ ఫైనల్ చేరింది. ఆర్సీబీ కీలక ఆటగాడైన కోహ్లీ ఎలాగైనా టైటిల్ గెలవాలనే తపనతో ఉన్నాడు.
By Medi Samrat
ఆర్సీబీ ఐపీఎల్ ఫైనల్ చేరింది. ఆర్సీబీ కీలక ఆటగాడైన కోహ్లీ ఎలాగైనా టైటిల్ గెలవాలనే తపనతో ఉన్నాడు. అయితే ఈ సమయంలో అతడికి షాకిచ్చారు కర్ణాటక పోలీసులు. బెంగళూరులోని క్రికెటర్ విరాట్ కోహ్లీ పబ్ వన్8 కమ్యూన్పై కర్ణాటక పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఈ పబ్ బెంగళూరులోని రత్నం కాంప్లెక్స్లోని ఆరవ అంతస్తులో ఉంది. బెంగళూరులోని విరాట్ కోహ్లీకి చెందిన వన్ 8 కమ్యూన్ పబ్ అండ్ రెస్టారెంట్పై కబ్బన్ పార్క్ పోలీసులు COTPA చట్టం (సిగరెట్ మరియు ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం) ఉల్లంఘన కింద కేసు నమోదు చేశారు. రెస్టారెంట్లో ధూమపానానికి కేటాయించిన జోన్ లేనందున పబ్పై COTPA చట్టంలోని సెక్షన్ 4 మరియు 21 కింద కేసు నమోదు చేయబడింది. పబ్లో స్మోకింగ్ ఏరియా విషయంలో అవసరమైన నిబంధనలు పాటించడం లేదని చెబుతున్నారు.
ఇదిలావుంటే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు IPL చరిత్రలో అత్యంత అభిమానులను కలిగిన జట్లలో ఒకటి. అయితే, 18 సంవత్సరాలుగా ఆ జట్టుకు కప్ కల నెరవేరలేదు. 2009, 2011, 2016లలో ఫైనల్కు చేరినా, టైటిల్ గెలవలేకపోయింది. ఈసారి, రాజత్ పాటిదార్ కెప్టెన్సీలో, విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ వంటి ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనలతో RCB ఫైనల్కు చేరుకుంది. విరాట్ కోహ్లీ తన కెరీర్లో ప్రతి రికార్డును సొంతం చేసుకున్నాడు. కానీ, ఐపీఎల్ టైటిల్ మాత్రం ఇప్పటికీ అతని చేతికి చిక్కలేదు. ఈసారి ఆరెంజ్ క్యాప్ రేసులో కూడా ముందున్న కోహ్లీ, తన జీవితకాల కలను నెరవేర్చుకోవాలని బలంగా కోరుకుంటున్నాడు.