గుజరాత్-పంజాబ్ మ్యాచ్‌కు ముందు తీవ్ర విషాదం..!

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభంలో ఒక విషాద వార్త వెలుగులోకి వచ్చింది.

By -  Medi Samrat
Published on : 31 March 2026 3:02 PM IST

గుజరాత్-పంజాబ్ మ్యాచ్‌కు ముందు తీవ్ర విషాదం..!

ఐపీఎల్ 2026 సీజన్ జరుగుతున్న తరుణంలో క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన ఒక దుర్వార్త వెలువడింది. ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం బీసీసీఐకి బ్రాడ్‌కాస్ట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఒక బ్రిటిష్ జాతీయుడు మరణించారు.

మృతుడిని బీసీసీఐ బ్రాడ్‌కాస్ట్ ఇంజనీర్ ఇయాన్ విలియమ్స్ లాంగ్‌ఫోర్డ్‌గా గుర్తించారు. అతను ముంబైలోని ట్రైడెంట్ హోటల్‌లో తన గదిలో విగతజీవిగా కనిపించాడు. నివేదికల ప్రకారం.. అతను మార్చి 29న ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత తన గది (నంబర్ 2715)కి తిరిగి వచ్చాడని, మార్చి 30న మరణించి కనిపించాడని తెలుస్తోంది.

ఇయాన్ విలియమ్స్ లాంగ్‌ఫోర్డ్ మార్చి 24 నుండి ఐపీఎల్‌ను కవర్ చేస్తూ ముంబైలోని ఒక హోటల్‌లో బస చేస్తున్నాడు. మార్చి 29న ఎంఐ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ ముగిసిన తర్వాత అతను తన గదికి తిరిగి వచ్చాడు. అతను ముంబై హోటల్‌లోని 2715 నంబర్ గదిలో బస చేస్తున్నాడు.

మార్చి 30వ తేదీన హోటల్ రిసెప్షనిస్ట్ ఇయాన్ గదికి ఫోన్ చేసినప్పుడు ఎటువంటి స్పందన రాలేదు. దాంతో అతన్ని చూడటానికి హోటల్ సిబ్బందిని పంపారు. సిబ్బంది ఇయాన్ గది తలుపు తట్టారు, కానీ ఎటువంటి స్పందన రాకపోవడంతో వారు మాస్టర్ కీని ఉపయోగించి తలుపు తెరిచారు. ఇయాన్ లాంగ్‌ఫోర్డ్ మృతదేహం నేలపై పడి ఉంది. హోటల్ డాక్టర్ అక్కడికి చేరుకుని అతడిని పరీక్షించి, మరణించినట్లు ప్రకటించారు. అనంతరం ముంబైలోని మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్‌లో అతని మరణంపై ఫిర్యాదు నమోదు చేశారు. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. అతను ఎలా మరణించాడు, గదిలో అతనికి ఏమైంది అనే విషయాలను నిర్ధారించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Next Story