ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ భారీ నజరానా
భారత జట్టుకు బీసీసీఐ కూడా భారీ నజరానాను ప్రకటించింది. జట్టు సభ్యులకు రూ.58 కోట్లను క్యాష్ రివార్డుగా అందించనుంది.
By Knakam Karthik
ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ భారీ నజరానా
ఇటీవల జరిగిన చాంపియన్స్ ట్రోఫీని భారత్ జట్టు గెలిచిన విషయం తెలిసిందే. దాదాపు 12 ఏళ్ల తర్వాత టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించిన రోహిత్ సేనకు.. బీసీసీఐ భారీ నగదు నజరానా ప్రకటించింది. చాంపియన్స్ ట్రోఫీలో ఆడిన భారత క్రికెటర్లకు 58 కోట్ల క్యాష్ ప్రైజ్ను బీసీసీఐ గురువారం ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటనను బీసీసీఐ జారీ చేసింది.
"రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు టోర్నీ ఆసాంతం ఆధిపత్యం ప్రదర్శించింది. ఒక్క ఓటమి లేకుండా కప్ను సొంతం చేసుకుంది. బంగ్లాదేశ్తో విజయం సాధించి ట్రోఫీని ఘనంగా ప్రారంభించిన టీమ్ ఇండియా.. పాకిస్థాన్, న్యూజిలాండ్స్ను కూడా చిత్తు చేసింది. ఇక సెమీస్లో ఆస్ట్రేలియాను మట్టి కరిపించి ఫైనల్కు చేరుకుంది. అక్కడా కివీస్ను ఓడించి కప్ను సొంతం చేసుకుంది. వరుసగా రెండు ఐసీసీ ట్రోఫీలను దక్కించుకున్న టీమిండియా ఆటగాళ్ల నిబద్ధతను బోర్డు గుర్తించింది. వారి శ్రమకు ఈ క్యాష్ ప్రైజ్ను అందిస్తుంది. ఆటగాళ్లు, సపోర్ట్ సిబ్బందికి నజరానా ప్రకటించడం ఆనందంగా ఉంది. దీనికి వారంతా అర్హులే. అంతర్జాతీయ వేదికపై భారత క్రికెట్ ఉన్నతస్థానాలకు దూసుకెళ్తోంది" అని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు.
ఐసీసీ టైటిళ్లను వరుసగా గెలవడం ప్రత్యేకమైందని, అంతర్జాతీయ స్థాయిలో టీమిండియా అంకితభావానికి, ఉత్తమ ఆటతీరుకు క్యాష్ రివార్డు సంకేతమని బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ తెలిపారు. ప్రతి ఒక్కరి కష్టానికి నగదు నజరానా గుర్తింపు వంటిదన్నారు. 2025లో ఇది రెండో ఐసీసీ ట్రోఫీ అన్నారు. అండర్19 వుమెన్స్ వరల్డ్కప్ గెలిచినట్లు చెప్పారు. క్యాష్ రివార్డు కింద ప్రతి ప్లేయర్కు 3 కోట్లు, హెడ్ కోచ్కు 3 కోట్లు, సపోర్టింగ్ స్టాఫ్కు 50 లక్షలు దక్కనున్నట్లు బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా తెలిపారు.
🚨 NEWS 🚨BCCI Announces Cash Prize for India's victorious ICC Champions Trophy 2025 contingent.Details 🔽 #TeamIndia | #ChampionsTrophy https://t.co/si5V9RFFgX
— BCCI (@BCCI) March 20, 2025