నిన్న సాక్షి అలా.. నేడు పూనియా ఇలా..!

భారత రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా బ్రిజ్ భూషణ్ సింగ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ ఎన్నికవ్వడాన్ని తప్పుబడుతున్నారు స్టార్ రెజ్లర్లు

By Medi Samrat  Published on  22 Dec 2023 4:00 PM GMT
నిన్న సాక్షి అలా.. నేడు పూనియా ఇలా..!

భారత రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా బ్రిజ్ భూషణ్ సింగ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ ఎన్నికవ్వడాన్ని తప్పుబడుతున్నారు స్టార్ రెజ్లర్లు. ఇక 2016 రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎన్నికైన తర్వాత రెజ్లింగ్‌ను విడిచిపెడుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాను రెజ్లింగ్ క్రీడ‌ను వ‌దిలేస్తున్న‌ట్లు చెప్పారు. బ్రిజ్ భూష‌ణ్ కు వ్యతిరేకంగా 40 రోజుల‌ పాటు రోడ్ల‌పై ధ‌ర్నా చేప‌ట్టామ‌ని, ఆ సమయంలో త‌మ‌కు దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు అండ‌గా నిలిచార‌ని తెలిపారు. ఎన్నికల్లో బ్రిజ్ భూష‌ణ్ బిజినెస్ అనుచరుడు విజ‌యం సాధించార‌ని.. అందుకే తాను రెజ్లింగ్ క్రీడ‌ను వదిలేస్తున్న‌ట్లు సాక్షీ మాలిక్ వెల్ల‌డించారు.

ఇక రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పునియా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని వెనక్కి ఇస్తున్నట్లు చెప్పారు. భారత ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ప్రధాని మోదీజీ.. మీరు మీ పనుల్లో బిజీగా ఉంటారని తెలుసు. కానీ.. ఈ దేశంలో రెజ్లర్ల పరిస్థితిని మీ దృష్టికి తీసుకొచ్చేందుకు లేఖ రాస్తున్నాను. డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై 2023, జనవరిలో మహిళా రెజ్లర్లు ఆందోళన చేసిన విషయం మీకు తెలిసే ఉంటుంది. వారికి మద్దతుగా నేను కూడా ఆ నిరసనలో పాల్గొన్నా. ఆ సమయంలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో మేం ఆందోళన విరమించాం. కానీ బ్రిజ్‌భూషణ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడంతో మళ్లీ ఆందోళనలు చేయాల్సి వచ్చింది. న్యాయం కోసం మా పతకాలను గంగా నదిలో కలిపేద్దామనుకున్నాం. అప్పుడు కూడా అతడిపై చర్యలు తీసుకుంటామని కేంద్రం హామీ ఇచ్చిందని బజ్‌రంగ్‌ తెలిపారు. తాజాగా జరిగిన డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికల ఫలితాలతో రెజ్లింగ్‌ సమాఖ్య మళ్లీ బ్రిజ్‌భూషణ్‌ చేతుల్లోకే వెళ్లినట్లయ్యిందని బజ్ రంగ్ పునియా తెలిపారు. ఇప్పుడు తామంతా న్యాయం కోసం ఎక్కడకు వెళ్లాలో అర్థం కావట్లేదన్నారు. తనకు 2019లో పద్మశ్రీ వచ్చిందని, అర్జున, ఖేల్‌రత్న వంటి అవార్డులు కూడా వచ్చాయన్నారు. ఈ రోజు మహిళా రెజ్లర్లు తమకు భద్రత లేని కారణంగా ఆటకు గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితులు వచ్చాయని అన్నారు. ఈ ఇష్యూ తనను ఎంతగానో కుంగదీసిందని.. అందుకే పద్మశ్రీని మీకే తిరిగిచ్చేయాలని నిర్ణయించుకున్నా అని ప్రధాని మోదీకి బజ్‌రంగ్‌ పునియా తన లేఖలో తెలిపారు.

Next Story