మరీ 30 పరుగులు అయితే కొట్టించుకునే వాన్ని కాదు: అక్షర్ పటేల్
By - Medi Samrat |
ముంబైలో ఇంగ్లాండ్తో జరిగిన టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్లో చివరి ఓవర్ వేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని భారత వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ వెల్లడించాడు. ఆ సమయంలో ఇంగ్లాండ్ జట్టుకు చివరి ఆరు బంతుల్లో 30 పరుగులు అవసరం. అయితే బంతిని శివం దూబేకు అప్పగించగా అతను విజయవంతంగా స్కోరును కాపాడుకున్నాడు. ఏడు పరుగుల తేడాతో ఉత్కంఠభరితమైన విజయాన్ని సాధించింది భారత్. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తనను బాధ్యతను స్వీకరించమని అడిగితే తాను అందుకు సిద్ధంగానే ఉన్నానని అక్షర్ చెప్పాడు.
మ్యాచ్ తర్వాత స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడిన అక్షర్ లాంగ్-ఆఫ్లో నిలబడి ఆఖరి ఓవర్లో బౌలింగ్ అవకాశం కోసం సిద్ధం కావడం ప్రారంభించానని చెప్పాడు. మ్యాచ్ హై-స్కోరింగ్ అయినా ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు కొట్టించుకోనని అక్షర్ చమత్కరించాడు. ముప్పై పరుగులు చాలా ఎక్కువ, నేను ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు కొట్టించే బౌలర్ ను కాదని తనకు తెలుసన్నాడు. వాంఖడే స్టేడియంలో జరిగిన సెమీఫైనల్లో భారత్ ఇంగ్లాండ్ను ఏడు పరుగుల తేడాతో ఓడించి తమ T20 ప్రపంచ కప్ కిరీటాన్ని కాపాడుకోవడానికి ఒక అడుగు దగ్గరగా వచ్చింది.