టాస్ పడింది.. కరెంట్ పోతుందనే టెన్షన్ లేదు..!

భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ-20 సిరీస్ లో భాగంగా రాయ్ పూర్ వేదికగా నాలుగో టీ-20 మ్యాచ్ జరగనుంది.

By Medi Samrat  Published on  1 Dec 2023 1:31 PM GMT
టాస్ పడింది.. కరెంట్ పోతుందనే టెన్షన్ లేదు..!

భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ-20 సిరీస్ లో భాగంగా రాయ్ పూర్ వేదికగా నాలుగో టీ-20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నెగ్గడం ద్వారా సిరీస్ ను సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో భారత్ ఉంది. ఈ మ్యాచ్ కు రాయ్ పూర్ లోని షాహీద్ వీరనారాయణ్ సింగ్ స్టేడియం వేదికగా రంగం సిద్ధమయ్యింది. మొదటి మూడుమ్యాచ్ లు ముగిసే సమయానికి 2-1తో పైచేయి సాధించింది భారత్. మూడో టీ20 మ్యాచ్ లో అనూహ్యంగా విజయం సాధించిన ఆస్ట్రేలియా జట్టు నాలుగో టీ20లో కూడా నెగ్గాలనే కసితో ఉంది.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు భారత్ కు బ్యాటింగ్ అప్పజెప్పింది. ఆస్ట్రేలియా జట్టులో 5 మార్పులు జరగగా.. భారత జట్టులో నాలుగు మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రసిద్ధ్ స్థానంలో ముఖేష్, అర్ష్దీప్ స్థానంలో దీపక్ చాహర్, తిలక్ స్థానంలో శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ స్థానంలో జితేష్ శర్మ వచ్చారు.

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): జోష్ ఫిలిప్, ట్రావిస్ హెడ్, బెన్ మెక్‌డెర్మాట్, ఆరోన్ హార్డీ, టిమ్ డేవిడ్, మాథ్యూ షార్ట్, మాథ్యూ వేడ్(w/c), బెన్ ద్వార్షుయిస్, క్రిస్ గ్రీన్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, తన్వీర్ సంఘ

భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్(సి), జితేష్ శర్మ(w), రింకు సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్

గత కొన్ని సంవత్సరాలుగా విద్యుత్తు బిల్లులు చెల్లించకపోవడంతో మైదానానికి కరెంట్ సరఫరా ఇవ్వడం లేదు. దీంతో ఈరోజు జరిగే మ్యాచ్ ను జనరేటర్లతో నడిపించనున్నారనే ప్రచారం సాగింది. 2009 నుంచి ఈ స్టేడియం విద్యుత్తు బిల్లులు చెల్లించడంలేదు. ఆ బకాయిలు పెరిగి పెరిగి రూ.3.16 కోట్లకు చేరాయి. వీటి గురించి పీడబ్ల్యూడీ, క్రీడాశాఖకు పలు సార్లు నోటీసులు పంపినా ఎటువంటి స్పందన రాలేదని విద్యుత్తుశాఖ అధికారులు తెలిపారు.

Next Story