టీమిండియా చారిత్రాత్మక విజయాన్ని కెమెరాలో బంధించిన ఆస్ట్రేలియా కెప్టెన్

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భార‌త‌ జట్టు విజయం సాధించింది.

By Medi Samrat  Published on  24 Dec 2023 3:13 PM GMT
టీమిండియా చారిత్రాత్మక విజయాన్ని కెమెరాలో బంధించిన ఆస్ట్రేలియా కెప్టెన్

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భార‌త‌ జట్టు విజయం సాధించింది. దీంతో భారత మహిళల క్రికెట్ జట్టు కల నెరవేరింది. భారత మహిళల జట్టు 1977లో ఆస్ట్రేలియాతో తొలి టెస్టు మ్యాచ్ ఆడింది. 46 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాను ఓడించి మహిళలు చరిత్ర సృష్టించారు. ఈ చారిత్రక ఘట్టం చిరకాలం గుర్తుండిపోతుంది. ఈ చిర‌కాల ఘ‌ట్టాన్ని ఆస్ట్రేలియా కెప్టెన్ అలిస్సా హీలీ స్వయంగా ఫోటోగ్రాఫర్‌గా మారి కెమెరాలో బంధించింది. భారత జట్టు గెలిచాక‌ ఛాంపియన్స్ హోర్డింగ్ వద్ద నిలబడి సంబరాలు చేసుకుంటుండ‌గా ఇది జరిగింది.

ఆస్ట్రేలియా కెప్టెన్ హీలీ తన ఫొటోగ్రఫీ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ.. భారత జట్టు సంబరాల‌కు సంబంధించిన చిత్రాలను క్లిక్ చేస్తూ కనిపించింది. భార‌త జ‌ట్టు ట్రోఫీని ఎత్తుకున్న క్ష‌ణాలకు సంబంధించిన చిత్రాలను తీస్తున్న పోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో హీలీపై క్రికెట్ అభిమానులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

హర్మన్‌ప్రీత్ కౌర్ ఆ క్షణంలో చాలా సంతోషంగా కనిపించింది. మ్యాచ్ అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా మేం పడిన కష్టానికి ఇది ప్రతిఫలం. దీని క్రెడిట్ మా సహాయక సిబ్బంది అందరికీ, ముఖ్యంగా మా బౌలింగ్ కోచ్, బ్యాటింగ్ కోచ్‌కి చెందుతుంది. చాలా సింపుల్‌గా ఉండేందుకు ప్రయత్నించామని హర్మన్‌ప్రీత్ కౌర్ తెలిపింది.

ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 219 పరుగులు చేసింది. ఆ జ‌ట్టులో తహ్లియా మెక్‌గ్రాత్ అర్ధ సెంచరీ చేసింది. భార‌త బౌల‌ర్లో పూజా వస్త్రాకర్ నాలుగు వికెట్లు పడగొట్టింది. అనంత‌రం భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 406 పరుగులకు చేపింది. భార‌త బ్యాట్స్‌మెన్‌ల‌లో స్మృతి మంధాన, రిచా ఘోష్, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ అర్ధ సెంచరీలు చేశారు. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 261 పరుగులకు కుప్పకూలింది. అనంత‌రం రెండో ఇన్నింగ్సులో భారత్ రెండు వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసి విజయం సాధించింది.


Next Story