భారత క్రికెట్ జట్టు పాస్ట్ బౌలర్ అశోక్ దిండా (36) ఆటకు గుడ్బై చెప్పేశాడు. టెస్టు,టీ20, వన్డే మూడు ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టు మంగళవారం వెల్లడించాడు. శ్రీలంకతో 2009లో జరిగిన టీ20 మ్యాచ్ ద్వారా అశోక్ దిండా అంతర్జాతీయ ఆరంగేట్రం చేశాడు. అనంతరం 2010లో వన్డే ఎంట్రీ ఇచ్చాడు. దిండా కెరియర్లో మొత్తం 13 వన్డేలు ఆడి 12 వికెట్లు తీశాడు. 9 టీ20 మ్యాచుల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించి 19 వికెట్లు తీశాడు. 2009లో దిండా అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ ప్రారంభమవగా.. 2013లో ముగిసింది.
ఇదిలావుండగా.. దిండా బెంగాల్ జట్టు తరుపున దేశవాళీ క్రికెట్లో సుదీర్ఘకాలం కొనసాగాడు. అయితే.. 2019లో రంజీ ట్రోఫీ సందర్భంగా.. బెంగాల్ క్రికెట్ జట్టు బౌలింగ్ కోచ్ రణదేబ్ బోస్పై దిండా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ దిండాను పక్కన పెట్టింది. బోస్కు క్షమాపణలు చెబితే నిర్ణయాన్ని పునఃపరిశీలిస్తామని క్యాబ్ అవకాశం ఇచ్చినప్పటికీ.. క్షమాపణ చెప్పేందుకు దిండా నిరాకరించాడు. ఇక దిండా చివరిసారిగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా గత నెల గోవాతో జరిగిన టీ20 మ్యాచ్లో ఆడాడు.