బాలు ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన చరణ్.. ఏమన్నారంటే..
By న్యూస్మీటర్ తెలుగు Published on 20 Sep 2020 8:19 AM GMTఆగస్టు 5న కరోనా వైరస్ బారిన పడటంతో ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెన్నై లోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసందే. ఆ తరవాత ఆయన ఆరోగ్యం క్షీణించడంతో డాక్టర్లు వెంటిలేటర్ పై చికిత్స అందించారు. దాంతో ఆయన కరొనాను జయించి క్రమంగా కోలుకుంటున్నారు. బాలు ఆరోగ్యంపై ఆయన కుమారుడు చరణ్ ఎప్పటికప్పుడు అప్డేట్ అందిస్తున్నారు.
తాజాగా బాలు ఆరోగ్యంపై చరణ్ శనివారం ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోను విడుదల చేసారు. ఆరోగ్యం నిలకడగగా ఉంది. నాన్న ఇప్పుడిప్పుడే ఆహారం తీసుకుంటున్నారు. అయితే ఇంకా వెంటిలేటర్ మీదే ఉన్నారు. ఊపిరితిత్తులు, శ్వాస వ్యవస్థ, శక్తి మరింత మెరుగుపడాల్సిన ఉంది. మిగలిన వ్యవస్థలన్నీ సాధారణంగా ఉన్నాయి. ఎటువంటి ఇన్ఫెక్షన్ లేదు. రోజూ 10 నుంచి 15 నిమిషాలు ఫిజియోథెరపీ చేస్తున్నారు.
ఆస్పత్రి సిబ్బంది సహాయంతో రోజూ 15-20 నిమిషాలు లేచి కూర్చుంటున్నారు. శుక్రవారం నుంచి ఆహారం తీసుకుంటుండటంతో ఆయన మరింత వేగంగా కోలుకునే అవకాశం ఉంది. ఈ సందర్భంగా నా తండ్రికి, కుటుంబ సభ్యులకు ఎంతో సహకరించిన ఎంజీఎం హెల్త్కేర్లోని వైద్యుల బృందానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అంటూ ఆ వీడియోలో పేర్కొన్నారు.