సిద్దులగుట్ట మహిళ మృతి కేసులో పురోగతి..!
By Newsmeter.Network Published on 30 Nov 2019 5:47 PM IST
వెటర్నరీ వైద్యురాలు అత్యాచారం, హత్య ఘటన మరువకముందే మరో దారుణం చోటు చేసుకుంది. నిన్న రాత్రి 8 గంటల ప్రాంతంలో శంషాబాద్ సిద్దులగుట్ట దగ్గర మహిళ హత్యకు గురైంది. ఈ దారుణం వెటర్నరీ వైద్యురాలు హత్య జరిగిన ప్రాంతానికి 2 కిలోమీటర్ల దూరంలోనే జరగడం గమనార్హం. కాగా, ఈ కేసులో పోలీసులు కొంత పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. మహిళ దగ్ధమైన ప్రాంతంలో అయ్యప్ప ఆలయం ఉండటంతో ఆ ఆలయ పూజారిని పోలీసులు విచారించినట్లు తెలుస్తోంది.
ఆ ప్రాంతంలో మహిళ ఏడుస్తూ తిరుగుతుండటంతో స్థానిక పూజారి ప్రశ్నించగా, ఆ మహిళ హిందీలో మాట్లాడగా, తనకు అర్థం కాలేదన్న పూజారి పోలీసులకు తెలిపినట్లు తెలుస్తోంది. అయితే మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతి చెందిన మహిళది ఉత్తరాధివాసికి చెందిన కవితాభాయ్గా గుర్తించారు. ధూల్పేట బోలక్ దాస్నగర్కు చెందిన ఆమె భర్త సంతోష్ను కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు సిద్దులగుట్ట ప్రాంతంలో సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. కవితాభాయ్ ఇంటి నుంచి నిన్న మధ్యాహ్నం ఒంటి గంటలకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. కాగా, మహిళ ఆత్మహత్య చేసుకుందా..? లేక ఎవరైన దుండుగుల హత్య చేసి మృతదేహాన్నిదాహనం చేసేందుకు యత్నించారా.. అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు