కారులో ప్ర‌యాణిస్తున్న మంత్రి.. స‌డ‌న్‌గా ఫోన్.. డ్రైవ‌ర్‌కు క‌రోనా పాజిటివ్ అని.. అంతే..

By Medi Samrat  Published on  27 Jun 2020 3:52 AM GMT
కారులో ప్ర‌యాణిస్తున్న మంత్రి.. స‌డ‌న్‌గా ఫోన్.. డ్రైవ‌ర్‌కు క‌రోనా పాజిటివ్ అని.. అంతే..

మంత్రి కారులో ప్రయాణిస్తున్నాడు.. స‌డ‌న్‌గా మంత్రి పీఏ ఫోన్ రింగ‌య్యింది. ఫోన్ ఎత్తిన పీఏకు అవ‌త‌లివైపు నుండి షాకింగ్ న్యూస్‌.. కారు డ్రైవరుకు కరోనా ఉందని స‌మాచారం. దీంతో మంత్రి మార్గమధ్యంలోనే కారు దిగి వేరే కారులోకి మారారు. ఈ ఘ‌ట‌న‌ తమిళనాడు రాష్ట్రంలోని తిరువన్నామలై పట్టణంలో జ‌రిగింది.

వివ‌రాళ్లోకెళితే.. త‌మిళనాడు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఎస్. రామచంద్రన్ స్వస్థలం సేవూర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు తిరువన్నామలై నుంచి కారులో బ‌య‌లుదేరారు మంత్రి. మార్గ‌మ‌ధ్యంలో మంత్రి డ్రైవరుకు కరోనా పాజిటివ్ అని రిపోర్టు వచ్చిందంటూ మంత్రి పీఏకు ఫోన్ కాల్ వచ్చింది. అంతే కరోనా భయంతో.. మంత్రి రామచంద్రన్ వెంటనే కారు దిగి.. తన కార్యక్రమాన్ని రద్దు చేసుకొని ఇంటికి వెళ్ళిపోయారు.

మంత్రి డ్రైవరు ప్ర‌యాణానికి ముందురోజే క‌రోనా ప‌రీక్ష‌కు శాంపిల్ ఇచ్చాడు. త‌రువాత రోజు మంత్రిని కారులో తీసుకువెళుతుండగా.. డ్రైవరుకు కరోనా పాజిటివ్ అని మంత్రి పీఏకు సమాచారం అందించారు. దీంతో డ్రైవరును థాచూర్ అర్బన్ హెల్త్ సెంటరుకు తరలించారు.

ఈ విష‌య‌మై మంత్రి మాట్లాడుతూ.. తాను డ్రైవరుతో మాట్లాడాన‌ని.. కరోనా లక్షణాలు లేవని చెప్పాడని మంత్రి పేర్కొన్నారు. అయితే.. డ్రైవరుకు కరోనా నిర్ధారణ కావడంతో తాను హోం క్వారంటైన్‌కు వెళుతున్నానని మంత్రి అన్నారు. డ్రైవరుకు కరోనా ఉంద‌ని తేల‌డంతో.. తాను మరోసారి కరోనా పరీక్ష చేయించుకున్నానని మంత్రి రామచంద్రన్ తెలిపారు.

Next Story