ఈమెయిల్ మీద ఒకే ఒక్క క్లిక్.. మోదీ, దోవల్ లకు సంబంధించిన సమాచారం హ్యాక్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Sep 2020 10:15 AM GMT
ఈమెయిల్ మీద ఒకే ఒక్క క్లిక్.. మోదీ, దోవల్ లకు సంబంధించిన సమాచారం హ్యాక్

ఒకే ఒక్క క్లిక్.. భారతదేశ భద్రతకు సంబంధించిన సమాచారం మొత్తం హ్యాక్ కు గురయ్యేలా చేసింది. ఓ వైపు సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు.. మరో వైపు చైనా సంస్థ జెన్‌హూవా డేటా ఇన్ఫర్మేషన్‌ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంతి, ఆర్మీ చీఫ్‌తో సహా వేలాదిమంది భారతీయులపై రహస్య నిఘా నిర్వహిస్తోందన్న వార్త.. ఇలాంటి సమయంలో జాతీయ భద్రతకు సంబంధించిన డేటాను కలిగి ఉన్న కంప్యూటర్లు హ్యాక్‌ కు గురవ్వడం సంచలనమైంది.

నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ).. భారత ప్రధాని నరేంద్ర మోదీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ సహా పలువురు ప్రముఖులు, దేశ భద్రతకు సంబంధించిన ఎంతో సమాచారం ఉంటుంది. అటువంటి డేటా ఉన్న కంప్యూటర్లు హ్యాక్ కు గురవ్వడం అధికారులను కలవర పెడుతోంది. ఈ హ్యాకింగ్‌కు సంబంధించిన మెయిల్‌ బెంగళూరు కేంద్రంగా ఉన్న యునైటెడ్‌ స్టేట్స్‌కు చెందిన సంస్థ నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.

ఎన్‌ఐసీ ఉద్యోగులకు వచ్చిన ఈ-మెయిల్‌ను ఓపెన్‌ చేయగానే కంప్యూటర్‌ వ్యవస్థలు అన్నీ ప్రభావితమై సమాచారం హ్యాక్‌ అయినట్లు పోలీస్‌ వర్గాలు తెలిపాయి. ఈ ఆరోపణలపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం నిపుణుల కమిటీని (నేషనల్ సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో) ఏర్పాటు చేసిందని ఎన్‌ఐసీ వర్గాలు తెలిపాయి. 30 రోజుల్లోగా నివేదికను సమర్పించనుంది. న్యూఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, కేసు నమోదు చేశామని వెల్లడించారు.

Next Story