సచిన్, గవాస్కర్, సెహ్వగ్ ల తరువాత.. ఆ రికార్డు సాధించింది రోహితే..
By Newsmeter.Network Published on 29 Jan 2020 10:16 AM GMTహిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఓపెనర్ గా ఓ రికార్డును అందుకున్నాడు. న్యూజిలాండ్తో హామిల్టన్ వేదికగా బుధవారం జరిగిన మూడో టీ20 మ్యాచ్లో ఆకాశమే హద్దు చెలరేగిన హిట్ మ్యాన్ కేవలం 40 బంతుల్లోనే 6x4, 3x6 సాయంతో 65 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఓ రికార్డును తన పేరున లిఖించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఓపెనర్గా 10వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.
2007 లో అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టిన రోహిత్ శర్మ చాలా కాలం పాటు మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేశాడు. అప్పటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సూచన మేరకు 2013లో వన్డేలు, టీ20ల్లో ఓపెనర్ అవతారం ఎత్తాడు. కానీ.. టెస్టుల్లో మాత్రం గత ఏడాది అక్టోబరు వరకూ ఈ హిట్మ్యాన్ మిడిలార్డర్లోనే బ్యాటింగ్ చేశాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్లో ఓపెనర్, బ్యాట్స్మెన్గా రోహిత్ శర్మ 14వేల పరుగుల మైలురాయికి చేరువలో ఉన్నాడు.
2007 నుంచి టెస్టుల్లో ఇప్పటి వరకూ 2,141 పరుగులు చేసిన రోహిత్ వన్డేల్లో 9,115, టీ20ల్లో 2,713 పరుగులు చేశాడు. మొత్తంగా 13,969 పరుగులతో ఉన్న రోహిత్ మరో 31 పరుగులు చేస్తే 14వేల మార్క్ని అందుకుంటాడు. కాగా భారత్ తరఫున ఇప్పటి వరకూ ఓపెనర్గా 10వేల పరుగుల మార్క్ని సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ మాత్రమే అందుకున్నారు.