కోహ్లీ రికార్డ్ మీద కన్నేసిన రో'హిట్'.. మరో 8 పరుగులు చేస్తే..
By Medi Samrat Published on 3 Nov 2019 11:44 AM GMTముఖ్యాంశాలు
- టీ20ల్లో 2,450 పరుగులతో అగ్రస్థానంలో కోహ్లీ
- 2,443 పరుగులతో రెండోస్థానంలో రోహిత్ శర్మ
- మరికాసేపట్లో బంగ్లాతో మొదటి టీ20
'హిట్మ్యాన్' రోహిత్ శర్మ అన్ని ఫార్మట్లలో పరుగుల వరద పారిస్తూ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ప్రస్తుతం తన కెరీర్ లోనే భీకర ఫామ్లో ఉన్న రోహిత్ నేటి నుండి బంగ్లాదేశ్తో జరిగే టీ20 సిరీస్కు సిద్ధమయ్యాడు. మూడు టీ20ల సిరీస్ నుంచి రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇవ్వడంతో రోహిత్ కెప్టెన్గా పగ్గాలు చేపట్టాడు.
అయితే.. ఈ టీ20 సిరీస్లో రోహిత్ శర్మను మరో రికార్డు ఊరిస్తోంది. ఇటీవలి కాలంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. టీ20 క్రికెట్లో అత్యధిక పరుగుల జాబితాలో మొదటి స్థానం కోసం ఇద్దరు పోటీపడుతున్నారు. 2,450 పరుగులతో కోహ్లీ మొదటి స్థానంలో ఉండగా.. 2,443 పరుగులతో రోహిత్ రెండో స్థానంలో ఉన్నాడు. ఈ రోజు జరిగే తొలి టీ20లో రోహిత్ 8 పరుగులు చేస్తే టీ20ల్లో కోహ్లీని అధిగమిస్తాడు.
అయితే.. కోహ్లీ 72 మ్యాచుల్లో 50 సగటుతో 2,450 పరుగులు చేస్తే.. రోహిత్ 98 మ్యాచుల్లో 32.14 సగటుతో 2,443 పరుగులు చేసాడు. అలాగే.. టీ20ల్లో ఎక్కువ హాప్ సెంచరీలు సాధించిన జాబితాలో కూడా కోహ్లీ, రోహిత్ పోటీపడుతున్నారు. కోహ్లీ 22 హాఫ్ సెంచరీలతో ముందంజలో ఉండగా.. రోహిత్ 21 హాఫ్ సెంచరీలతో కోహ్లీ తర్వాత స్థానంలో ఉన్నాడు. మరో రెండు హాప్ సెంచరీలు చేస్తే కోహ్లీ రికార్డ్ బద్దలవుతుంది. కోహ్లీ ఈ సిరీస్ లో లేకపోవడంతో ఈ సిరీస్ లోనే రోహిత్ ఈ మైలురాయిని అధిగమిస్తాడని అభిమానులు కోరుకుంటున్నారు.