మాజీ ఎంపీ రాయపాటికి షాక్.. ట్రాన్స్ట్రాయ్ ఆస్తుల వేలం
By Medi Samrat Published on 25 July 2020 7:27 PM ISTమాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నాయకుడు రాయపాటి సాంబశివరావు మరోసారి చిక్కుల్లో పడ్డారు. రాయపాటికి చెందిన ట్రాన్స్ట్రాయ్ లిమిటెడ్ ఆస్తుల వేలానికి రంగం సిద్ధమైంది. కన్స్ట్రక్షన్ కంపెనీ అయిన ట్రాన్స్ట్రాయ్.. సెంట్రల్ బ్యాంక్కు సుమారు రూ. 452.41 కోట్లు బకాయి పడింది. వాటిని తిరిగి చెల్లించని కారణంగా.. తనఖా పెట్టిన ఆస్తులను ఆగస్టు 18న వేలం వేయనున్నట్లు సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. ఈ నేపథ్యంలో బిడ్స్ దాఖలుకు ఆగస్టు 14 చివరి తేదీగా పేర్కొంది.
సెంట్రల్ బ్యాంక్కు చెల్లించాల్సిన రుణానికి హామీదారులుగా ట్రాన్స్ట్రాయ్ మాజీ ఎండీ శ్రీధర్, రాయపాటితోపాటు మరో ఐదుగురు ఉన్నారు. ట్రాన్స్ట్రాయ్ 2017 జనవరి 9నాటికి సదరు బ్యాంకుకు మొత్తం రూ. 452.41 కోట్లు బకాయి పడింది. అలాగే.. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో కెనరా బ్యాంక్కు సంబంధించి సుమారు రూ.300 కోట్లు మోసం చేసిన కేసులోనూ రాయపాటిపై సీబీఐ కేసు నమోదైంది.