'దిశ' నిందితుల ఎన్‌కౌంటర్‌ఫై రాష్ట్రపతి సంచలన వ్యాఖ్యలు

By Newsmeter.Network  Published on  6 Dec 2019 9:37 AM GMT
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ఫై రాష్ట్రపతి సంచలన వ్యాఖ్యలు

'దిశ' అత్యాచారం, హత్య ఘటనపై నిందితులను ఈ రోజు తెల్లవారు జామున కాల్చి చంపారు పోలీసులు. విచారణలో భాగంగా నిందితురాలిని హత్య చేసి దహనం చేసిన ప్రాంతానికి తీసుకెళ్లి సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌కు చేస్తుండగా, నిందితులు పరారయ్యేందుకు యత్నించి, పైగా పోలీసులపై రాళ్లు రువ్వడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు నలుగురిని ఎన్‌కౌంటర్‌ చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోంది. తాజాగా భారత రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపిస్టులపై దయ అవసరం లేదు... క్షమాభిక్ష పిటిషన్లపై సమీక్ష జరగాలి అని వ్యాఖ్యనించారు. ఈఘటనపై ప్రముఖులు చాలా మందే వ్యాఖ్యలు చేశారు. కాని దేశ రాష్ట్రపతి వ్యాఖ్యలు చేయడం సంచలనమే అని చెప్పాలి.

క్షమాభిక్ష పటిషన్లపై తుది నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రపతికే...

ఈ దేశంలో క్షమాభిక్ష పిటిషన్లపై తుది నిర్ణయం తీసుకునే అధికారం ఒక్క రాష్ట్రపతికే ఉంది. ఇప్పటికే చాలా హత్య కేసులు, అత్యాచారం కేసుల్లో కోర్టులు ఉరిశిక్ష విధించాయి. కానీ ఆ శిక్షలు వెంటనే అమలు కావడం లేదు. తాజాగా ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనపై ఆరుగురిని అరెస్టు చేయగా, అందులో ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు. మరో నిందితుడు మైనర్‌ అని శిక్ష అమలు చేయలేదు. ఇక నలుగురికి ఉరిశిక్ష విధించగా, అందులో వినయ్‌ శర్మ క్షమాభిక్ష కోసం పిటిషన్‌ దాఖలైంది. ఇలా దాదాపు 20 ఏళ్లకు పైగా క్షమాభిక్ష పిటిషన్లు పెట్టుకున్నవాళ్లు కూడా చాలా మందే ఉన్నారు. ఇలాంటి వాటిపై రాష్ట్రపతి పదవిలో ఉన్న వారు ఏదో ఒక నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ఎప్పటికప్పుడు ఆ పిటిషన్లపై ఏ నిర్ణయమూ తీసుకోకుండా... మౌనంగా ఉంటున్నారు. ఇంతకుముందు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం... అలాంటి కొన్ని కేసుల్లో క్షమాభిక్ష పిటిషన్లను రద్దు చేశారు. ఉరి వేసేందుకు కేంద్రానికి సిఫార్స్ కూడా చేశారు. ఇప్పుడున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇలాంటి విషయాలపై పెద్దగా స్పందించలేదు. రేపిస్టులపై దయ అవసరం లేదన్నారు. తద్వారా క్షమాభిక్ష పిటిషన్లను తోసిపుచ్చే అవకాశాలున్నాయన్న సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న క్షమాభిక్ష పిటిషన్లపై సమీక్ష జరపాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేయడం మంచి విషయమే అని చెప్పాలి. ముఖ్యంగా 'దిశ' కేసులో నిందితుల్ని ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులకు రాష్ట్రపతి వ్యాఖ్యలు కాస్త బలం ఇచ్చినట్లేనని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Next Story