రాజశేఖర్ హెల్త్ బులిటెన్ విడుదల.. స్పందించిన చిరంజీవి
By న్యూస్మీటర్ తెలుగు Published on 22 Oct 2020 9:24 AM GMTకరోనా బారినపడ్డ సినీ నటుడు రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రి తెలిపింది. రాజశేఖర్ కోవిడ్-19 చికిత్స కోసం సిటీ న్యూరో సెంటర్లో జాయిన్ అయ్యారు. దీంతో ఉదయం నుండి ఆయన ఆరోగ్యంపై రకరకాల వార్తలు వస్తున్న నేఫథ్యంలో హాస్పిటల్ యాజమాన్యం రాజశేఖర్ హెల్త్ బులిటెన్ను విడుదల చేసింది.
రాజశేఖర్ ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారని, వెంటిలేటర్ అవసరం లేకుండానే చికిత్సకు స్పందిస్తున్నారని బులిటెన్లో తెలిపింది. ఇదిలావుంటే.. తన తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి వివరిస్తూ శివాత్మిక గురువారం ఉదయం ఓ ట్వీట్ చేసింది. తన తండ్రి గురించి అందరూ ప్రార్థనలు చేయాలని కోరింది. దీంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. అనంతరం తన తండ్రి ఆరోగ్యం నిలకడగానే ఉందని శివాత్మిక మరో ట్వీట్ చేసింది.
ఇదిలావుంటే.. తన తండ్రి రాజశేఖర్ కోసం ప్రార్ధనలు చేయాలన్న శివాత్మిక చేసిన ట్వీట్ కి మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. తన మిత్రుడు, సహ నటుడు రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని కాంక్షించారు. ఆయన ఆరోగ్యం కోసం ప్రార్ధనలు చేస్తున్నట్లు ట్వీట్లో పేర్కొన్నారు.