ప్రియాంక గాంధీ ఫోన్ హ్యాక్...!
By న్యూస్మీటర్ తెలుగు Published on 3 Nov 2019 12:27 PM GMTఢిల్లీ: ప్రతిపక్ష నేతల ఫోన్లను కేంద్ర ప్రభుత్వం హ్యాక్ చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రియాంక గాంధీ వాద్రా, వెస్ట్ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ సహా పలువురు నేతల ఫోన్లను సెంట్రల్ సర్కార్ హ్యాక్ చేసిందని కాంగ్రెస్ చేసిన ఆరోపణలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. ప్రియాంక గాంధీ ఫోన్ను వాట్సాప్ స్పైవేర్ ద్వారా హ్యాక్ చేశారని కాంగ్రెస్ మండిపడింది. నేతల ఫోన్లు హ్యాక్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
మరోవైపు ఇజ్రాయిల్కు చెందిన సైబర్ సెక్యూరిటీ కంపెనీ ఎన్ఎస్ఓ వాట్సాప్ సర్వర్ల ద్వారా స్పైవేర్తో 20 దేశాలకు చెందిన 1400 మంది యూజర్లను టార్గెట్ చేసిందని ఫేస్బుక్ ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. భారత్లో సార్వత్రిక ఎన్నికలకు ముందు యూజర్లను టార్గెట్ చేసిన వారిలో నేతలు, జర్నలిస్టులు, ప్రభుత్వ అధికారులు ఉన్నట్టు ఫేస్బుక్ తెలిపింది. ఎన్ఎస్ఓపై ఫేసుబుక్ కోర్టులో దావా వేసి న్యాయపోరాటానికి దిగింది.