డిసెంబ‌ర్‌లో అసెంబ్లీ ర‌ద్దు.. మార్చిలో ఎన్నిక‌లు

TPCC chief Revanth Reddy comments on TS Assembly Elections.టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 March 2022 2:32 PM GMT
డిసెంబ‌ర్‌లో అసెంబ్లీ ర‌ద్దు.. మార్చిలో ఎన్నిక‌లు

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌న్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో సీఎం కేసీఆర్​ అసెంబ్లీని రద్దు చేస్తారని, మార్చిలో ఎన్నికలు వస్తాయని రేవంత్ జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో నిజ‌మైన హీరోలు కార్య‌క‌ర్త‌లేన‌ని ఆయ‌న అన్నారు. మ‌ల్కాజిగిరి నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ స‌భ్య‌త్వ న‌మోదుపై స‌మీక్ష‌చేసిన కార్య‌క‌ర్త‌నుద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇన్ని రోజులు కాంగ్రెస్.. నాయకుల పార్టీ ఇప్పుడు కార్యకర్తల పార్టీ అని అన్నారు. కార్య‌క‌ర్త‌ల న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకునే అధ్య‌క్షుడిగా ఉంటాన‌ని తెలిపారు. 80 లక్షల ఓట్లు తీసుకువస్తే 90 సీట్లు సాధిస్తామ‌ని చెప్పారు. కాంగ్రెస్ లో చేరిన వాళ్లంతా కాంగ్రెస్ కుటుంబ సభ్యులేన‌ని అన్నారు.

'పార్టీ అధికారంలోకి వ‌స్తే కాంగ్రెస్ స‌భ్యుల‌కే ప‌థ‌కాల్లో మొద‌టి ప్రాధాన్య‌త‌. ఏ డివిజ‌న్‌కు ఏం కావాలో రాసి పెట్టండి. అన్నీ మీ ద్వారానే చేయిస్తాం. పార్టీ కోసం ప‌నిచేసిన వారికే ప‌ద‌వులు. డిసెంబ‌ర్‌లో కేసీఆర్ అసెంబ్లీని ర‌ద్దు చేస్తారు. మార్చిలో ఎన్నిక‌లు జ‌రుగుతాయి. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన ఏడాదిలోనే రెండున్న‌ర ల‌క్ష‌ల ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తాం. కేసీఆర్ లాక్కున్న అసైన్డ్ భూముల‌ను తిరిగి ఇస్తాం. ఆరోగ్యశ్రీ ని పూర్తి స్థాయిలో అమలు చేస్తాం. కార్పొరేట్ ఆసుపత్రిలలో పేదలకు వైద్యం అందిస్తాం. రైతులు పండించిన ప్రతీ గింజను కొంటాం. మద్దతు ధర ఇస్తాం. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన తొలి రోజే ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ను అంబేడ్క‌ర్ విజ్ఞాన కేంద్రంగా మారుస్తాం. కేసీఆర్ కి బ్యాకు లేదు ప్రంటు లేదు. ఢిల్లీలో కేసీఆర్ ని కలసిన సుబ్రమణ్య స్వామి ఆయన అవినీతి చిట్టా ను చెప్పిపోయాడు. బీజేపీకి వ్య‌తిరేకంగా ఏ ఫ్రంట్ పెట్ట‌డం లేద‌ని ఝార్ఖండ్‌తో కేసీఆర్ చెప్పారు. కేసీఆర్ ప్రంటు పెడతాడు.. దేశానికి టెంటు వేస్తాడు అనే భ్రమలు అవసరం లేదు. దేశానికి ర‌క్ష‌ణగా నిలిచేది కాంగ్రెస్ పార్టీనే. రాహుల్ గాంధీ ప్రధాని అయినప్పుడు దేశానికి రక్ష' అని రేవంత్ రెడ్డి అన్నారు.

Next Story