కాంగ్రెస్‌లోకి జూబ్లీహిల్స్ స్వతంత్ర అభ్యర్థి.. ఫుల్ జోష్‌లో క్యాడర్‌

జూబ్లీహిల్స్ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి నవీన్ యాదవ్ బుధవారం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.

By అంజి  Published on  16 Nov 2023 4:47 AM GMT
Telangana polls, Jubilee Hills, independent candidate, Congress, Naveen Yadav

కాంగ్రెస్‌లోకి జూబ్లీహిల్స్ స్వతంత్ర అభ్యర్థి.. ఫుల్ జోష్‌లో క్యాడర్‌

హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి నవీన్ యాదవ్ బుధవారం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి మహ్మద్‌ అజారుద్దీన్‌కు నవీన్‌ యాదవ్‌ మద్దతు తెలుపుతూ మాజీ క్రికెటర్‌ గెలుపునకు కృషి చేస్తానన్నారు. అలాగే నవీన్ యాదవ్ స్వతంత్ర అభ్యర్థిగా వేసిన నామినేషన్ విత్ డ్రా చేసుకున్నాడు. నవీన్ యాదవ్ చేరికతో జూబ్లీహిల్స్ కాంగ్రెస్‌ పార్టీ క్యాడర్ ఫుల్ జోష్‌లో ఉంది. నవీన్ యాదవ్ కాంగ్రెస్ చేరితే జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్ బలం పెరిగే అవకాశాలు ఉన్నాయి.

కాగా, తెలంగాణలో బీజేపీ ప్రభావం అసలు లేదని, ఈ నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్రంలో కాంగ్రెస్ హవా ఉందని మహ్మద్ అజారుద్దీన్ బుధవారం అన్నారు. ''ఇక్కడ మా పార్టీ బలంగా ఉంది. ఇక్కడ బీజేపీ ప్రభావం అంతగా లేదు. ఇక్కడ కాంగ్రెస్ హవా ఉంది. కాంగ్రెస్ అభివృద్ధి పనులు చేస్తుందని ప్రజలు నమ్ముతున్నారు'' అని అన్నారు.

తెలంగాణలో అభివృద్ధి పనులపై బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై అజారుద్దీన్ మాట్లాడుతూ.. ''గత 10 సంవత్సరాలలో, జూబ్లీహిల్స్ ప్రాంతంలో (హైదరాబాద్) అభివృద్ధి శూన్యం. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు విఫలమైంది. ఇది దాదాపు కూలిపోయింది. ముఖ్యంగా పెద్ద ఏరియాగా భావించే జూబ్లీహిల్స్ ప్రాంతంలో తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు'' అని అన్నారు.

జూబ్లీహిల్స్‌ స్థానం నుంచి ఆ పార్టీ భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌ను బరిలోకి దింపింది.

తెలంగాణలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, మరో నాలుగు రాష్ట్రాలతో పాటు ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది. అంతకుముందు భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కాంగ్రెస్‌పై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 50 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించి తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని అన్నారు. ‘‘ఇంతకుముందు మంచినీరు, తాగునీరు, కరెంటు లేక పరిశ్రమలు మూతపడేవి, రైతుల ఆత్మహత్యలు జరిగేవి. తెలంగాణ ఏర్పడిన తర్వాత సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామన్నారు. నీరు, విద్యుత్ సమస్యలను పరిష్కరించాం’’ అని చెప్పారు.

2018లో రాష్ట్రంలో జరిగిన మునుపటి అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి (TRS)గా పిలువబడే భారత రాష్ట్ర సమితి (BRS) మొత్తం 119 సీట్లలో 88 సీట్లను గెలుచుకుంది, మొత్తం ఓట్ల షేర్‌లో 47.4 శాతం సాధించింది. కాంగ్రెస్ కేవలం 19 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది.

Next Story