కిషన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డితో రాష్ట్ర ప్రజల బతుకులు ఆగమవుతాయి: హరీశ్‌రావు

మంత్రి హరీశ్‌రావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌పై విమర్శలు చేశారు.

By Srikanth Gundamalla  Published on  29 July 2023 9:30 AM GMT
Telangana, Harish Rao, BJP, Kishan Reddy, Congress, Revanth Reddy,

కిషన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డితో రాష్ట్ర ప్రజల బతుకులు ఆగమవుతాయి: హరీశ్‌రావు

తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ క్రమంలో రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇక ఎలాగైనా కేసీఆర్‌ను గద్దె దించాలని బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు నాయకులు. తాజాగా మంత్రి హరీశ్‌రావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని టార్గెట్‌ చేస్తూ విమర్శలు చేశారు.

సిద్దిపేట జిల్లా పర్యటనలో భాగంగా ములుగు మండల కేంద్రంలో పోలీస్‌ స్టేషన్‌, వర్గల్ మండలం గౌరారంలో సర్కిల్ పోలీస్‌ స్టేషన్‌ భవన నిర్మాణ పనులకు మంత్రి మహమూద్ అలీతో కలిసి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విపక్ష పార్టీపై హరీశ్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. రైతు వ్యతిరేక చట్టాలతో వేలాది మంది రైతుల చావులకు బీజేపీ కారణమైందని అన్నారు. ఇక మూడ గంటల కరెంటు చాలు రైతులకు అంటూ తమ నిజస్వరూపాన్ని కాంగ్రెస్‌ బయటపెట్టుకుందని విమర్శించారు. ఈ రెండు పార్టీలు తెలంగాణ ప్రజలకు శాపంగా మారాయని హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్‌ అని చెప్పుకొచ్చారు. అందుకే ఈసారి కూడా తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను దీవించాలని మంత్రి హరీశ్‌రావు కోరారు.

చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డిని అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష నాయకులు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ఫైర్ అయ్యారు మంత్రి హరీశ్‌రావు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువు అని.. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిచ చంద్రబాబుకి శిష్యుడని చెప్పారు. వీళ్లిద్దరూ ఆ నాయకులు చెప్పినట్లుగానే వింటారని ఆరోపించారు. రేవంత్‌, కిషన్‌రెడ్డితో తెలంగాణ ప్రజల బతుకులు ఆగమవుతాయని అన్నారు. తెలంగాణ ప్రజలు ఎవరి వల్ల మంచి జరుగుతుందో ఆలోచించుకోవాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు.


Next Story