స్థానిక నేతలను కేసీఆర్ బానిసల కంటే హీనంగా చూశారు: రేవంత్‌రెడ్డి

ఎన్నికల్లో స్థానిక ప్రజాప్రతినిధుల పాత్ర కీలకం అని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి అన్నారు.

By Srikanth Gundamalla  Published on  26 Nov 2023 6:39 AM GMT
revanth reddy, letter, telangana, congress, elections ,

 స్థానిక నేతలను కేసీఆర్ బానిసల కంటే హీనంగా చూశారు: రేవంత్‌రెడ్డి

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడింది. మరో రెండ్రోజుల్లో ప్రచారం ముగియనుండగా.. ఈ నెల 30వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో రాత్రి.. పగలు.. సభలు.. ర్యాలీలు.. సోషల్‌ మీడియా.. టీవీల్లో ప్రచారాలు ఇలా అన్ని రకాలుగా ఓట్ల కోసం ప్రచారాలు జరుపుతున్నాయి ప్రధాన పార్టీలు. తాజాగా.. ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. స్థానిక ప్రజాప్రతినిధులను ప్రస్తావిస్తూ ఆ లేఖ రాశారు కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి.

ఎన్నికల్లో స్థానిక ప్రజాప్రతినిధుల పాత్ర కీలకం అని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి అన్నారు. అలాంటి స్థానిక ప్రజా ప్రతినిధులకు బీఆర్ఎస్ పాలనలో ఇబ్బందులే ఎదురయ్యాయని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో స్థానిక ప్రజాప్రతినిధులు ఎన్నో అవమానాలు.. అవస్థలు పటడ్డారని అన్నారు. జెడ్పీటీసీగా తాను పని చేశానని.. స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధుల బాధ్యతలు తనకూ తెలుసుని బహిరంగ లేఖలో పేర్కొన్నారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి. ప్రభుత్వ పాలనకు స్థానిక ప్రజాప్రతినిధులే పునాదులని చెప్పారు. కానీ కేసీఆర్‌ వారిని పట్టించుకోలేదని.. బానిసల కంటే హీనంగా చూశారని రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్ పాలనలో స్థానిక ప్రజాప్రతినిదులకు నిర్ణయాధికారం లేక.. నిధులు లేక ఎన్నో బాధలు పడ్డారని.. అవన్నీ తనకు తెలుసన్నారు రేవంత్‌రెడ్డి. అంతేకాదు.. కేసీఆర్‌ సర్కార్‌ స్థానిక ప్రజా ప్రతినిధులపై కేసులు పెట్టి వేధించి.. పార్టీ ఫిరాయించేలా చేశారని ఆరోపించారు. ఇక స్థానికంగా చాలా మంది ప్రజాప్రతినిధులు సొంత డబ్బులు.. అప్పులు చేసి పనులు చేయించుకున్నారనీ అన్నారు. వాటికి సంబంధించిన బిల్లులు పెడితే ప్రభుత్వం పట్టించుకోలేదని రేవంత్‌రెడ్డి చెప్పారు. దాంతో.. స్థానిక ప్రజాప్రతినిధులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత బాధాకరమని వెల్లడించారు. ఈ రాక్షస పాలన అంతానికి, స్థానిక ప్రజా ప్రతినిధులకు పూర్వ వైవభం తీసుకొస్తామని అన్నారు రేవంత్ రెడ్డి. అలా జరగాలంటే ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపునకు కృషి చేయాలని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖలో కోరారు.

Next Story