ఏపీ, తెలంగాణ మంత్రుల మాట‌ల తూటాలు : ప్రశాంత్ రెడ్డి VS పేర్ని నాని

Prashanth Reddy VS Perni Nani. తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి.. ఏపీ సీఎం జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిధులు లేక ఏపీ

By Medi Samrat  Published on  12 Nov 2021 1:03 PM GMT
ఏపీ, తెలంగాణ మంత్రుల మాట‌ల తూటాలు : ప్రశాంత్ రెడ్డి VS పేర్ని నాని

తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి.. ఏపీ సీఎం జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిధులు లేక ఏపీ ముఖ్యమంత్రి జగన్ కేంద్ర ప్రభుత్వం వద్ద అడుక్కుంటున్నారని అన్నారు. తెలంగాణ వస్తే అడుక్కుతింటారని ఎద్దేవా చేసినవారే.. ఇప్పుడు బిచ్చమెత్తుకుంటున్నారని చెప్పారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నడవాలంటే కేంద్ర ప్రభుత్వ నిధులు కావాలని అన్నారు. కేంద్రం ఒత్తిడితోనే రైతుల వ్యవసాయ మోటార్లకు ఏపీ ప్రభుత్వం కొత్త మీటర్లు బిగించిందని చెప్పారు. దేశం మొత్తంలో రైతుల మోటార్లకు మీటర్లను బిగించాలనేది మోదీ ఆలోచన అని.. తెలంగాణలో మాత్రం మీటర్లు పెట్టబోమని అన్నారు.

మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి పేర్ని నాని ఘాటుగా స్పందించారు. నిధుల కోసం మేం కేంద్రం వద్ద అడుక్కుంటున్నామా.. మరి కేసీఆర్ ఏం బిచ్చమెత్తుకోవడానికి ఢిల్లీకి వెళుతున్నారంటూ కౌంటర్ ఇచ్చారు. మీకు కేంద్రంపై కోపం ఉంటే ఏపీ మీద పడి ఏడవడం ఎందుకు? అని నాని ప్రశ్నించారు. మాకు రావాల్సిన నిధుల కోసమే కేంద్రాన్ని అడుగుతున్నాం. ప్రజాప్రయోజనాలే మాకు ముఖ్యం. అంతేతప్ప ఇందులో దాచిపెట్టాల్సిందేమీ లేదు. మీలాగా బయట కాలర్ ఎగరేస్తూ లోపల కాళ్లు పట్టుకోము. అది జగన్ తత్వం కానే కాదు. తెలంగాణ అంత ధనిక రాష్ట్రం అయితే.. కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని పేర్ని నాని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ ను సమష్టిగా అభివృద్ధి చేశారని.. కానీ హైదరాబాద్ నుంచి అందుతున్న ఆదాయంతో ఇప్పుడు తెలంగాణ వ్యక్తులు బాగుపడుతున్నారని తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు.


Next Story